చంద్రబాబును కలవరపెడుతున్న కేసీఆర్, టైంకు హ్యాండిస్తున్నారు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పక్కా వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీ నేతలకు, శాసన సభ్యులకు గాలం వేస్తున్నారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. టీడీపీ అధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును లక్ష్యంగా చేసుకొని ఆయన 'ఆపరేషన్ ఆకర్ష్' పావులు కదుపుతున్నారని అంటున్నారు.
తాజాగా మంచిరెడ్డి కిషన్ రెడ్డి చేరిక మరో నిదర్శనమంటున్నారు. టీడీపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు, ఇబ్రహీంపట్నం శాసన సభ్యుడు అయిన మంచిరెడ్డి ఈ నెల 24వ తేదీన తెరాసలో చేరుతున్నట్లు చెప్పారు. అయితే, ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ పర్యటన గురువారం నాడు పాలమూరు జిల్లాలో ఉండనుంది. అదే సమయంలో చంద్రబాబు పైన తెలంగాణ అటెన్షన్ తగ్గించేందుకు కేసీఆర్.. మంచిరెడ్డి చేరికను ఉపయోగించుకుంటున్నారంటున్నారు.
గతంలోను చంద్రబాబు పర్యటన సమయంలోనే లేక టీడీపీ కార్యక్రమం సమయంలోనే.. ఇలా టీడీపీ నేతలు కారు ఎక్కిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడే దీనిపై చర్చ జరిగింది. టీడీపీ ఏదో ఒకటి తలపెడుతున్న సమయంలో కేసీఆర్ వ్యూహాత్మకంగా ఆపరేషన్ ఆకర్ష్ను ప్రయోగిస్తున్నారనే వాదనలు వినిపించాయి. ఇప్పుడు మంచిరెడ్డి చేరిక అందుకు కొనసాగింపేనని చెబుతున్నారు.
తెలంగాణలో టీడీపీని లేకుండా చేయడమే కేసీఆర్ ప్రధాన ఉద్దేశ్యమని అంటున్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించాక, తెరాస అధికారంలోకి వచ్చాక ఆయన ముఖ్యంగా టీడీపీని టార్గెట్ చేసుకున్నారని ఆ పార్టీ చెబుతోంది. ఇప్పటికే పలువురు శాసన సభ్యులు తెరాసలో చేరారు. తెలంగాణలో ప్రభావం చూపలేకపోతున్న టీడీపీ నుండి ఏకంగా ఎమ్మెల్యేలే వెళ్లిపోతుండటం చంద్రబాబును బాగా కలవరపెడుతున్న అంశమని చెబుతున్నారు.
నాడు ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణారెడ్డి, ధర్మారెడ్డిలను పార్టీలో ఉంచేందుకు టీడీపీ నేతలు యత్నించారు. ఆ తర్వాత మహేందర్ రెడ్డి కూడా తెరాసలో చేరారు. ఇప్పుడు మంచిరెడ్డిని కూడా పార్టీలో ఉంచేందుకు ప్రయత్నించినప్పటికీ కుదరలేదు. మంచిరెడ్డిని పార్టీలోనే ఉంచేందుకు నారా లోకేష్ కూడా ప్రయత్నించినప్పటికీ, ఆయనది విఫలయత్నంగా మిగిలింది.
కాగా, తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి, ఈ నెల 24న తెరాసలో చేరుతున్నానని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి బుధవారం ప్రకటించారు. ఆయన సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిసిన అనంతరం ఈ ప్రకటన చేశారు. నియోజకవర్గం అభివృద్ధి కోసమే, టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.