జగన్ ఎమ్మెల్యేల చేరికపై తెరాసలో డైలమా! కేబినెట్లో...
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితిలోకి ఇప్పుడు కాకపోయినా మరికొద్ది రోజుల తర్వాత అయినా... ఖమ్మం జిల్లాలో గెలిచిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రజాప్రతినిధులు చేరే అవకాశముందనే ప్రచారం ఆగడం లేదు. ఖమ్మం జిల్లాలో జగన్ పార్టీ నుండి గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీని పార్టీలో చేర్చుకోవడానికి తెరాస అధిష్ఠానం ఆసక్తి చూపిస్తుందట. ఇందుకు అటు నుండి కూడా సానుకూల సంకేతాలు ఉన్నాయట.
ఇప్పుడు కాకపోయినా కొంతకాలం తర్వాత అయినా ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీ గులాబీ కండువా కప్పుకోవచ్చంటున్నారు. అయితే జగన్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీని తెరాసలో చేర్చుకోవద్దని ఖమ్మం జిల్లాలో ఉన్న తెరాస ఏకైక ఎమ్మెల్యే జలగం వెంకట్రావు వర్గం అధిష్ఠానాన్ని కోరినట్లుగా ప్రచారం జరుగుతోంది. వైయస్సార్ కాంగ్రెసు ఎమ్మెల్యేలు, ఎంపీని టీఆర్ఎస్లో చేర్చుకోకుండా, జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీని కింది స్థాయి నుంచి తామే సొంతంగా నిర్మించుకుంటామంటున్నారు.

మంత్రివర్గంపై కెసిఆర్ దృష్టి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ తన మంత్రివర్గ విస్తరణపై కసరత్తు చేస్తున్నారు. కేబినెట్లో మిగిలిన ఖాళీల భర్తీపై ఆయన ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ నియోజకవర్గాల సంఖ్య (119) రీత్యా కేబినెట్లో ముఖ్యమంత్రితో కలిపి 18 మంది మంత్రులు ఉండొచ్చు. ఈ మేరకు కేసీఆర్ తన కేబినెట్లోకి మరో ఆరుగురిని మంత్రులుగా తీసుకునే వీలుంది.
వీటి భర్తీ అసెంబ్లీ సమావేశాల తర్వాత ఉండొచ్చని, ఆషాఢ మాసం ప్రారంభం కావడానికి ముందే.. ఈ నెలాఖరులోపే ఉంటుందంటున్నారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 14న ముగిశాయి. ఈనెల 27 నుంచి ఆషాఢ మాసం ప్రారంభమవుతోంది. ముహూర్తాలపై నమ్మకం కలిగిన కెసిఆర్ ఆషాఢమాసంలో మంత్రివర్గాన్ని విస్తరించక పోవచ్చునంటున్నారు.
ఈ మేరకు తిథి ప్రకారం చూస్తే ఈ నెల 22న దశమి.. మంచి రోజు. ఉంటే ఆ రోజు మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉండొచ్చంటున్నారు. అలా కాకపోతే శ్రావణ మాసానికి మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం వాయిదా పడుతుందంటున్నారు. కాగా, ఖాళీగా ఉన్న ఆరు మంత్రి పదవులు ఎవరెవరికి దక్కుతాయనే చర్చ తెరాస వర్గాల్లో చర్చ సాగుతోంది.
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. మంత్రివర్గం రేసులో కొప్పుల ఈశ్వర్, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, సిలక్ష్మారెడ్డి, జలగం వెంకట్రావు, గంప గోవర్ధన్, ఏనుగు రవీందర్రెడ్డి, కోవా లక్ష్మి, రేఖా నాయక్, వి శ్రీనివాస్ గౌడ్, స్వామిగౌడ్లు ముందున్నారు. ఈ క్రమంలో ఎస్టీ కోటాలో కోవా లక్ష్మి లేదా రేఖా నాయక్కు మంత్రి పదవి ఖాయమనే ప్రచారం టీఆర్ఎస్ వర్గాల్లో జరుగుతోంది.












Click it and Unblock the Notifications