డిజిపి, సిపి.. కెసిఆర్ కసరత్తు: టాప్4 పోస్ట్లు వీరికేనా?
హైదరాబాద్: జూన్ 2 అపాయింటెడ్ డే నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు... డిజిపి, చీఫ్ ఇంటెలిజెన్స్, సైబరాబాద్ కమిషనర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వంటి ప్రధాన పోస్టుల పైన కసరత్తు చేస్తున్నారు. ఆ పోస్టులకు ఇప్పటికే పలువురి పేర్లు దాదాపు ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్గా శివధర్ రెడ్డి బాధ్యతలు చేపట్టే అవకాశముంది. ప్రస్తుతం ఆయన విశాఖపట్నం పోలీసు కమిషనర్గా పని చేస్తున్నారు. ఆ బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యేందుకు సిద్ధంగా ఉండాలంటూ డిజిపి కార్యాలయం నుంచి ఇప్పటికే శివధర్ రెడ్డికి మౌఖిక సమాచారం అందిన విషయం తెలిసిందే. ఈ మేరకు నేడు లేదా రేపు అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.
పరిపాలన సజావుగా సాగేందుకు తన ప్రభుత్వంలో తెలంగాణ ప్రాంత అధికారులే ఉండాలని కెసిఆర్ భావిస్తున్నారు. అందులో భాగంగా తనకు అనుకూలమైన అధికారుల పేర్లను ఆయన గవర్నర్కు సమర్పించారు. ఈ క్రమంలోనే శివధర్ రెడ్డికి ఇంటెలిజెన్స్ చీఫ్గా బాధ్యతలు దక్కనున్నాయి. సోమవారం ఎన్నికల కోడ్ ఎత్తివేసిన కొద్ది గంటల్లోనే ఆయన బదిలీ ఉత్తర్వులు వెలువడ్డాయి. విశాఖ రేంజ్ డిఐజి ఉమాపతికి విశాఖ సిపిగా తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు.
అపాయింటెడ్ డే జూన్ 2 కంటే ముందుగానే హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్లు సైతం బదిలీ కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జంట కమిషనరేట్లకు కమిషనర్లుగా అనురాగ్ శర్మ, సివి ఆనంద్ ఉన్నారు. వీరికి కొత్త ప్రభుత్వంలో కీలక బాధ్యతలు లభించనున్నట్టు సమాచారం.
డిజిపి సహా పోలీసు శాఖలోని అన్ని విభాగాల్లో తనకు అనుకూలమైన వారినే నియమించుకునేందుకు కెసిఆర్ ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఐపిఎస్ అధికారులు రాష్ట్రంలో ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు.. ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారెవరనే విషయాలపై సమాచారం సేకరిస్తున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఐపిఎస్లు ఇక్కడ పనిచేసేందుకే సుముఖత చూపుతున్నారు.
కెసిఆర్తో రోజువారీ భేటీ అవుతున్నారు. శాఖాపరంగా అవసరమైన సమాచారాన్ని క్షణాల్లో అందిస్తున్నారు. ప్రభుత్వంలో పోలీసుల పనితీరు ఏవిధంగా ఉండాలి, సిబ్బంది సంక్షేమం, శాంతిభద్రతల పరిరక్షణకు వెంటనే తీసుకోవాల్సిన చర్యలేమిటి అనేదానిపై కెసిఆర్ అధికారులతో చర్చిస్తున్నట్లు సమాచారం. అనురాగ్ శర్మ, రాజీవ్ త్రివేది, మల్లారెడ్డి, ఆర్పీ ఠాకూర్, అమిత్ గార్గ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, గంగాధర్, వెస్ట్జోన్ డిసిపి సుధీర్ బాబు మంగళవారం కెసిఆర్తో భేటీ అయ్యారు.
ఇదిలా ఉండగా... ఇంటెలిజన్స్ చీఫ్గా శివధర్ రెడ్డి రానుండగా... తెలంగాణ ప్రాంతానికి డిజిపికి అనురాగ్ శర్మ రానున్నారని సమాచారం. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న మహేందర్ రెడ్డి హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అయ్యే అవకాశాలున్నాయి. 1984 బ్యాచ్కు చెందిన వి నాగిరెడ్డి పేరును ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవికి పరిశీలిస్తున్నారు. ఈయన పేరు దాదాపు ఖరారైందంటున్నారు. చందనాఖాన్ కూడా రేసులో ఉన్నారు.