ల్యాంకోలాంటి సంస్థల ఆటకట్టిస్తం, తప్పుకోలేవు: కెసిఆర్
హైదరాబాద్: ల్యాంకో వంటి దొంగ సంస్థల అట కట్టిస్తమని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అన్నారు. మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ పేర్లు చెప్పి తప్పించుకోలేదని ఆయన అన్నారు. మంత్రి వర్గ సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎపి భూదాన్ చట్టం కింద తెలంగాణ భూదాన్ చట్టం తెస్తామని ఆయన చెప్పారు. భూదాన్ భూములను కబ్జా చేసినవారు ఇచ్చేయాలని ఆయన అన్నారు. ఇక నుంచి భూకబ్జాదారుల ఆగడాలు సాగవని ఆయన అన్నారు.
హైదరాబాదులో 60 వేలకు పైగా అక్రమ భవనాలు ఉన్నాయని ఆయన చెప్పారు. హైదరాబాదులో అంతూపొంతూ లేకుండా భూకబ్జాలు జరిగాయని ఆయన అన్నారు. ఇక నుంచి అలాంటివి సాగవని ఆయన అన్నారు. కబ్జాకు గురైన దేవాదాయ భూములను స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. హైదరాబాదులో పేకాట క్లబ్బులను ఏరివేస్తామని చెప్పారు. హైదరాబాదులో డంపింగ్ యార్డుల కోసం త్వరలో 2 వేల ఎకరాలు కేటాయిస్తామని కెసిఆర్ చెప్పారు.
గృహనిర్మాణాల పథకంలో అక్రమాలు చేస్తే జైలుకు పంపిస్తామని ఆని చెప్పారు. లిక్కర్ లాబీ కోసం హైదరాబాదులో కల్లు దుకాణాలను మూసేశారని, హైదరాబాదులో కల్లు దుకాణాలను తెరిపిస్తామని ఆయన చెప్పారు. అన్ని శాఖలకు తెలంగాణ పేరు పెడుతామని చెప్పారు. టీవి చానెళ్ల ప్రసారాల నిలిపివేతలో ప్రభుత్వ ప్రమేయం లేదని స్పష్టం చేశారు.
కొత్త వక్ఫ్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పారు. విద్యార్థుల కోసం ఫాస్ట్ పథకాన్ని ప్రవేశపెడ్తామని, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేసి దాన్ని ప్రవేశపెడ్తామని ఆయన చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కెజి నుంచి పీజి వరకు ఉచిత విద్యను అందిస్తామని ఆయన చెప్పారు. ఫీజు రీయింబర్స్మెంట్ పెద్ద కుంభకోణమని ఆయన అన్నారు. జలయజ్ఞం ధనయజ్ఞంగా మారిందని ఆయన అన్నారు. అడ్డదిడ్డంగా ప్రాజెక్టులు నిర్మించబోమని ఆయన చెప్పారు. హైదరాబాదుపై గవర్నర్ పెత్తనాన్ని అంగీకరించబోమని కెసిఆర్ చెప్పారు.