ఏపీలో కేసీఆర్ పార్టీ పెట్టాలి- మా కోరికా అదే : జగన్ అప్పుడే చెప్పారు - పేర్ని నాని..!!
ఏపీలో తనను పార్టీ పెట్టమని కోరుతున్నారంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యల పైన మంత్రి పేర్ని నాని స్పందించారు. కేబినెట్ నిర్ణయాల బ్రీఫింగ్ సమయంలో మంత్రి ఈ అంశం పైన కీలక వ్యాఖ్యలు చేసారు. ఎయిడెడ్ విద్యా సంస్థల పై ఎలాంటి బలవంతం లేదని మంత్రి స్పష్టం చేసారు. ఐచ్చికంగానే వారు తమ నిర్ణయం తీసుకోవచ్చని చెప్పారు. ఇక, గంజాయి గురించి జరుగుతున్న వివాదం పైన సీఎం జగన్ కేబినెట్ లోనే క్లారిటీ ఇచ్చారు. గంజాయి సాగు పైన ఉక్కుపాదం మోపుతున్నామని..ప్రతిపక్షాల విమర్శలు తిప్పి కొట్టాలని మంత్రులకు సూచించారు.

కేసీఆర్ పార్టీ మేము కూడా కోరుకుంటున్నాం
ఇక, ఏపీలో గంజాయి గురించి కేబినెట్ లొనే చర్చించామని 2017 లొనే అప్పటి మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారని మంత్రి పేర్ని నాని గుర్తు చేసారు. పవన్ కళ్యాణ్ కూడా 2018 లొనే గంజాయి సాగవుతోందని ట్వీట్ చేశారని మంత్రి వివరించారు. అప్పట్లో ప్రోత్సహించారని... ఇప్పుడు పట్టుకోలేక మా ప్రభుత్వం ఇబ్బందులు పడుతోందని మంత్రి వ్యాఖ్యానించారు. ఏపీలో కేసీఆర్ పార్టీ పెట్టాలని తాము కూడా కోరుకుంటున్నామంటూ మంత్రి వెల్లడించారు. రెండు రాష్ట్రాలు కలిసిపోతే ఆయన భేషుగ్గా పోటీ చేయొచ్చని చెప్పారు. రెండు రాష్ట్రాలకు కలిపేస్తూ క్యాబినెట్ లో తీర్మానం పెట్టాలని మంత్రి సూచించారు.

ఒకటే రాష్ట్రంగా ఉండాలని గతంలోనే
ఏపీ తెలంగాణ లు ఒకటే రాష్ట్రంగా ఉండాలని జగన్ గతంలోనే కోరుకున్నారని పేర్ని నాని గుర్తు చేసారు. ఇక, కొంత కాలంగా సినీ ఇండస్ట్రీలో ..ఇటు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చకు కారణమైన ఆన్ లైన్ టిక్కెట్ల విధానం పైన కేబినెట్ మంత్రులు కొన్ని సూచనలు చేసారు. ఆర్డినెన్స్ కాకుండా నేరుగా అసెంబ్లీలో చట్ట సవరణ చేద్దామంటూ కొందరు మంత్రులు ప్రతిపాదించారు. ఇప్పుడే ఆర్డినెన్స్ జారీ చేస్తే.. ప్రక్రియను కొనసాగించవచ్చంటూ అధికారులు సూచించారు. దీంతో..సరేనని అంగీకరించిన కెబినెట్ అందుకు ఆమోద ముద్ర వేసింది.

అవంతి ఏకరువు.. మంత్రుల చమత్కారం
ఇక, కేబినెట్ లో ..టూరిజం ప్రాజెక్టులు బాగా తెచ్చారన్న మంత్రి అవంతికి మంత్రి వర్గ సమావేశంలో మంత్రి మేకపాటి అభినందించారు. దీంతో..విశాఖకు వచ్చిన ప్రాజెక్టులను సీఎంకు ఏకరువు పెట్టిన మంత్రి అవంతి వరుస గా ఆ ప్రాజెక్టుల గురించి వివరించారు. ఆ సమయంలో..మంత్రి అవంతితో విడిగా సమావేశం పెట్టుకోవాలంటూ పలువురు మంత్రుల చమత్కరించారు. ఇక, రోడ్ల రిపేర్ల మీద ముఖ్యమంత్రి జగన్ కేబినెట్ సమావేశం లో కీలక సూచనలు చేసారు.

రోడ్ల రిపేరుకు సీఎం ఆదేశాలు
రాష్ట్రంలో తక్షణమే 8 వేల కిలోమీటర్ల రహదారుల నిర్వహణకు 1176 పనులను 2,200 కోట్ల రూపాయలను వ్యయం చేసేలా నిర్ణయం తీసుకున్నారు. రాయలసీమ లో తక్షణమే, నవంబర్ మాసంతంలో కోస్తాలో పనులు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఇక, ఇప్పుడు కేసీఆర్ వ్యాఖ్యల పైన మంత్రి పేర్ని నాని స్పందిస్తూ చేసిన కామెంట్స్ పైన అటు టీఆర్ఎస్ నేతలు ఏ విధంగా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications