కెసిఆర్ మాస్టర్ ప్లాన్: 200కిమీకు మెట్రో రైలు
హైదరాబాద్: మెట్రోరైలు మార్గాన్ని 200 కిలోమీటర్ల వరకు పొడగించాలని హైదరాబాద్ మెట్రోరైలు అధికారులను, నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టి అధికారులను ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు ఆదేశించారు. ప్రస్తుతం చేపట్టిన 72 కిలోమీటర్ల మెట్రోరైలు మార్గాన్ని 200 కిలోమీటర్ల వరకు పొడిగించే విధంగా ప్రణాళికను రూపొందించి నివేదిక సమర్పించాల్సిందిగా ముఖ్యమంత్రి సూచించారు.
సచివాలయంలో బుధవారం ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి, ఎక్సైజుశాఖ మంత్రి పద్మారావుగౌడ్, హైదరాబాద్ మెట్రోరైలు మేనేజింగ్ డైరెక్టర్ ఎన్విఎస్ రెడ్డి, ఎల్ అండ్ టి మెట్రోరైలు మేనేజింగ్ డైరెక్టర్ విబి గాడ్గిల్, జిహెచ్ఎంసి కమిషనర్ సోమేశ్కుమార్తో ముఖ్యమంత్రి సమీక్షించారు.
గత ప్రభుత్వం ముందు చూపు లేకుండా నగర పరిధిలోనే మెట్రోరైలు సౌకర్యానికి ప్రణాళికను రూపొందించిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అలా కాకుండా భవిష్యత్తులో నగర జనాభా పెరుగదలను దృష్టిలో పెట్టుకొని మెట్రోరైలు విస్తరణకు ప్రణాళికను రూపొందించాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే నూతన పారిశ్రామిక విధానం వల్ల అనేక సంస్థలు తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు ముందుకు వస్తున్నాయని ముఖ్యమంత్రి చెప్పారు.
కొత్త పరిశ్రమలతో పాటు ఐటిఐఆర్ ప్రాజెక్టు కూడా నగరానికి రాబోతుందని, దీంతో హైదరాబాద్ నగరం శరవేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉండటంతో దీనికి అనుగుణంగా మెట్రోరైలు మార్గాన్ని విస్తరించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి సూచించారు. భవిష్యత్లో నగర జనాభా రెండు కోట్లు దాటబోతుందని, దీనికి అనుగుణంగా నగర విస్తరణకు మాస్టర్ ప్లాన్ను రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు.
మాస్టర్ ప్లాన్లో రవాణా వ్యవస్థ ఎంతో ముఖ్యమని, ఇందులో మెట్రోరైలు విస్తరణ ప్రధానమైందన్నారు. గత పాలకులు అవగాహనా రాహిత్యంతో మెట్రోరైలును ప్రస్తుత అవసరాలకు అనుగుణంగానే రూపొందించారని, అలా కాకుండా శాశ్వత అవసరాలకు సరిపడే విధంగా మెట్రోరైలుకు డిజైన్ చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ సూచించారు.
వచ్చే ఏడాది ఉగాది పర్వదినాన నాగోలు నుంచి మెట్టుగూడ వరకు మెట్రోరైలు నడపాలని లక్ష్యంగా పెట్టుకోవడంతో అందుకు అనుగుణంగా పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. అవసరమైతే ట్రాఫిక్ను దారి మళ్లించి అయినా పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
మెట్రోరైలు నిర్మాణంలో తలెత్తిన కోర్టు వివాదాలను వెంటనే పరిష్కరించుకొని ముందుకు వెళ్లాలని, నష్టపరిహారం చెల్లింపులో జాప్యం చేయవద్దని ముఖ్యమంత్రి సూచించారు. మెట్రోరైలు పనులు వేగవంతంగా జరగడానికి త్వరలో మున్సిపల్, పోలీస్, రెవిన్యూ తదితర సంస్థల అధికారులతో సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.