నరేంద్రమోడీని కలవనున్న సిఎం కెసిఆర్, పాలనపై దృష్టి
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవనున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటు సభ్యులు మంగళవారంసాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని అపాయింటుమెంట్ తీసుకుంటారు. అపాయింటుమెంట్ దొరకగానే కెసిఆర్ ఎంపీలతో కలిసి వెళ్లి ప్రధానిని కలవనున్నారు.
మరోవైపు కెసిఆర్ మంగళవారం జిహెచ్ఎంసి అధికారులతో భేటీ అయ్యారు. వర్షాకాలం నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. నగరవాసులకు ట్రాఫిక్ చిక్కులు లేకుండా, ఆయా ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీళ్లు చేరకుండా ఉండేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే జిహెచ్ఎంసి కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే అంశంపై చర్చించారు.
పౌరసరఫరాల అధికారులతో మంత్రి ఈటెల భేటీ
పౌరసరఫరాల అధికారులతో మంత్రి ఈటెల రాజేందర్ మంగళవారం సమావేశమయ్యారు. తడిసిన ధాన్యాన్ని రెండు మూడు రోజుల్లో కొనుగోలు చేయాలని, మొక్కజొన్నకు మద్దతు ధర అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి, పద్మారావు సచివాలయంలో చాంబర్లను పరిశీలించారు.
టిడిపి శాసన సభా పక్షం భేటీ
తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష భేటీ బుధవారం సాయంత్రం తిరుపతిలోని శ్రీనివాస ఆడిటోరియంలో జరగనుంది. ఈ సమావేశంలో శాసనసభాపక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకొంటారు. ఈ భేటీ ఏర్పాట్లను టీడీపీ సీనియర్ నేతలు బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి, గాలి ముద్దుకృష్ణమ నాయుడు పర్యవేక్షిస్తున్నారు.