ఎన్నాళ్టకెన్నాళ్టకు... చంద్రబాబును కలిసిన 'పెద్దాయన'!
కర్నూలు జిల్లాలో ఆయన తెలుగుదేశం పార్టీకి సీనియర్ నేత. 2019 ఎన్నికల్లో పోటీ చేయలేదు. తనకు బదులుగా తన కుమారుడిని పోటీకి దింపినప్పటికీ ఓటమి తప్పలేదు. అప్పటి నుంచి రాజకీయాల్లో ఆయన పేరు ఎక్కడా వినపడలేదు. అంతేకాదు టీడీపీ కర్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొనలేదు. ఎప్పుడన్నా ఒకసారి మీడియాలో ఆ నేత గురించి ప్రస్తావన వచ్చేది. అంతవరకే. అయితే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇటీవలి కర్నూలు జిల్లా పర్యటనలో ఆయన పాల్గొంటారా? లేదా? అనే ఆసక్తి నెలకొంది. కానీ సదరు నేత చంద్రబాబును కలిశారు. ఆయనే కేఈ కృష్ణమూర్తి
మూడున్నర సంవత్సరాల తర్వాత కలయిక
మూడున్నర సంవత్సరాల తర్వాత కేఈ చంద్రబాబును కలిశారు. జిల్లా పర్యటనకు బాబు విమానాశ్రయానికి వచ్చిన తరుణంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన కుమారుడిని రాజకీయాల్లోకి తీసుకొచ్చిన తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లో తన దూకుడును తగ్గించుకున్నారు. అంతేకాదు కేఈ కృష్ణమూర్తి తోపాటు ఆయన సోదరుడు కేఈ ప్రభాకర్ కూడా ఉన్నారు. మూడున్నర సంవత్సరాల తర్వాత బయట కనపడటంతో ప్రస్తుతం దీనిపై కర్నూలు జిల్లా టీడీపీలో చర్చ జరుగుతోంది.
రాబోయే ఎన్నికల్లో ధర్మవరం సుబ్బారెడ్డి
కేఈ సోదరుల సొంత నియోజకవర్గం డోన్. ప్రస్తుతం ఇక్కడి నుంచి ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కేఈ సోదరులు మూడున్నర సంవత్సరాల నుంచి దూరంగా ఉండటంతో రాబోయే ఎన్నికల్లో బుగ్గనను ఎదుర్కోవడానికి ధర్మవరం సుబ్బారెడ్డికి బాబు టికెట్ ఇస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై కేఈ సోదరులు కినుక వహించారు. టీడీపీ కష్టకాలంలో ఉన్న సమయంలో సీనియర్ నేతలు పలువురు ముఖం చాటేశారు. వారిలో వీరు కూడా ఉన్నారు.
టీడీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు
నియోజకవర్గంలో ధర్మవరం సుబ్బారెడ్డి అందరినీ కలుపుకొని పనిచేస్తున్నారు. మంత్రి బుగ్గన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నారంటూ ఆయన ఆరోపిస్తున్నారు. అనవసరంగా అక్రమ కేసులు బనాయిస్తున్నారని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతకు ఇంత వడ్డీతో సహా మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.