‘మీ వల్ల జగన్తో మాటలు పడాలా?’: కేశినేని ధర్నా, బోండా వాగ్వాదం, ఉద్రిక్తత
విజయవాడ రవాణా కార్యాలయం వద్ద శనివారం ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అధికారులు తనిఖీల పేరుతో అవినీతికి పాల్పడుతున్నారని పార్లమెంటు సభ్యుడు కేశినేని ఆరోపించారు.
అమరావతి: విజయవాడ రవాణా కార్యాలయం వద్ద శనివారం ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అధికారులు తనిఖీల పేరుతో అవినీతికి పాల్పడుతున్నారని పార్లమెంటు సభ్యుడు కేశినేని ఆరోపించారు. తనిఖీలు చేయకుండానే అనుమతులు ఇస్తున్నారని మండిపడ్డారు.
కేశినేని నానితోపాటు ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు కూడా అధికారులతో వాగ్వాదానికి దిగారు. అధికారుల వైఖరికి నిరసనగా కార్యాలయంలో కేశినేని నాని బైఠాయించారు. ప్రైవేటు బస్సులకు అడ్డగోలుగా అనుమతులు ఇస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫిర్యాదు చేసేందుకు వచ్చిన టీఎన్టీయూసీ కార్యకర్తలను ఆర్టీఏ సిబ్బంది బయటకు పంపారని కేశినేని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదాలు జరిగితే ప్రభుత్వంపై నింద వేస్తున్నారని అధికారులపై ఎంపీ కేశినేని నాని మండిపడ్డారు. అధికారులు తప్పులు చేస్తుంటే ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డితో తాము మాటలు పడాలా? అని ఎంపీ కేశినేని నాని ప్రశ్నించారు.
అధికారుల తీరుతో తాము ప్రతిపక్షాలతో మాట పడాల్సి వస్తోందని మండిపడ్డారు. ప్రైవేటు బస్సులతో ఆర్టీసీకి తీవ్ర నష్టం కలుగుతోందని అన్నారు. కొంత కాలం క్రితం ప్రైవేటు బస్సు ప్రమాదంలో 42మంది కాలిపోయారని, మొన్న 10మంది చనిపోయారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవన్నీ జరుగుతుంటే కళ్లు మూసుకున్నారా? అంటూ అధికారులను కేశినేని నాని ప్రశ్నించారు.