కేశినేని మరో విజయ్ మాల్యా!, బ్యాంకులకు వందల కోట్ల ఎగనామం: చెవిరెడ్డి
బస్సులను అడ్డం పెట్టుకుని బ్యాంకుల నుంచి వందల కోట్లు తెచ్చుకున్న కేశినేని నాని.. విజయవాడలో ఓ స్టార్ హోటల్ కడుతున్నారని చెవిరెడ్డి ఆరోపించారు.
తిరుపతి: అనూహ్యంగా తన ట్రావెల్ సంస్థను మూసివేస్తున్నట్లు ప్రకటించి టీడీపీ ఎంపీ కేశినేని పెద్ద చర్చకు తావిచ్చారు. ముఖ్యంగా ప్రతిపక్షం వైసీపీ ఈ నిర్ణయం వెనుక కారణాలను వెతికే పనిలో పడింది. ఇదే క్రమంలో తాజాగా ఆ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కేశినేని ట్రావెల్స్ పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బస్సులను అడ్డం పెట్టుకుని బ్యాంకుల నుంచి వందల కోట్లు తెచ్చుకున్న కేశినేని నాని.. విజయవాడలో ఓ స్టార్ హోటల్ కడుతున్నారని చెవిరెడ్డి ఆరోపించారు. బ్యాంకు రుణాలను ఎగ్గొట్టి కేశినేని మరో విజయ్ మాల్యా లాగా తయారయ్యాడని ఎద్దేవా చేశారు. ట్రావెల్స్ మూసివేత సీఎం చంద్రబాబు సూచన మేరకే జరిగిందన్నారు.

ట్రావెల్స్ పేరు మీద రుణాలు పొందిన కేశినేని ఆ నిధులను పక్కదారి మళ్లించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేశినేని బస్సులను వెంటనే ఆర్టీసీ స్వాధీనం చేసుకోవాలని చెవిరెడ్డి డిమాండ్ చేశారు. అయితే ఎన్నికల సమయంలో ఎంపీ టికెట్ కోసం భారీగా ఖర్చు పెట్టడం, చంద్రబాబు పాదయాత్రకు నిధులు భారీగా ఖర్చు పెట్టడంతో కేశినేని ట్రావెల్స్ దివాళా తీసిందన్న ఆరోపణలు వస్తున్నాయి.
ఉన్న డబ్బులను రాజకీయావసరాల కోసం ఖర్చు పెట్టడం వల్ల ట్రావెల్స్ నిర్వహణ భారం పెరిగి మూసివేయాలని నిర్ణయించినట్లుగా పలువురు ఆరోపిస్తున్నారు. ట్రావెల్స్ సంస్థను మూసివేసిన కేశినేని ఇకనుంచి కార్గో బిజినెస్ పై ఫోకస్ చేయనున్నారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications