జగన్ డేట్..టైం ఫిక్స్ చేయండి - మేం రెఢీ..డైరెక్ట్ ఫైట్ : ఒకేసారి తేల్చేద్దాం-కేశినేని నాని సవాల్...!!
టీడీపీ ఎంపీ కేశినేని నాని ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు సవాల్ చేసారు. చంద్రబాబుకు దీక్షకు ఆయన సంఘీభావం ప్రకటించారు. చాలా కాలం తరువాత ఆయన టీడీపీ కార్యాలయానికి వెళ్లారు. కొంత కాలంగా పార్టీ పైన అలక బూనిని కేశినేని వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేయనని తేల్చి చెప్పారు. ఎంపీగా మాత్రం కొనసాగుతానని..పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటానని చెప్పుకొచ్చారు. తాజగా జరిగిన కార్పోరేషన్ ఎన్నికల్లో కేశినేని నాని కుమార్తె టీడీపీ నుంచి మేయర్ అభ్యర్ధిగా పోటీ చేసారు.
కేశినేని అలక వీడి అధినేత వద్దకు
నగరంలో కొంత మంది నేతలు తనకు వ్యతిరేకంగా పని చేస్తున్నా..అధినాయకత్వం పట్టించుకోవటం లేదనేది కేశినేని నాని ఆవేదన గా పార్టీలో చర్చ సాగుతోంది. ఇక, కొద్ది రోజుల క్రితం ఆకస్మికంగా కేశినేని కార్యాలయంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఫొటోలు తొలిగించి ఆ స్థానంలో రతన్ టాటా ఫొటోలు ఏర్పాటు చేసారు. అదే విధంగా విజయవాడ నగర టీడీపీ నేతల ఫొటోలు తొలిగించి వాటి స్థానంలో నాని సేవా కార్యక్రమాల ఫొటోలను పెట్టారు. దీంతో..ఇక, నాని టీడీపీలో కొనసాగటం పైన అనేక రకాలుగా ప్రచారం సాగింది.
చంద్రబాబుతో ఏకాంత చర్చలు
అయితే, ఈ మధ్య కాలంలో టీడీపీ కార్యాలయానికి దూరంగా ఉంటున్నారు. ఈ రోజు సడన్ గా టీడీపీ కార్యాలయానికి వెళ్లి తమ అధినేత చంద్రబాబు దీక్షకు మద్దతు ప్రకటించారు. చంద్రబాబు దీక్ష వద్దకు వెళ్లిన కేశినేనాని ని పక్కకు తీసుకెళ్లిన చంద్రబాబు కొద్ది సేపు ఏకాంతంగా చర్చించారు. ఆ తరువాత వేదిక మీదకు వచ్చిన తరువాత కేశినేని నాని ముఖ్యమంత్రి జగన్ పైన ఫైర్ అయ్యారు. టీడీపీ కార్యాలయం పైన దాడిని తప్పు బట్టారు. ఎవరూ లేని సమయంలో వచ్చి దాడులు చేసారని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రికి నాని సవాల్
దొంగ చాటుగా టీడీపీ ఆఫీసులకు వచ్చి విధ్వంసం చేయటం కాదని... ముఖ్యమంత్రి విజయవాడలో ఏ గ్రౌండ్ లో తేల్చుకుందామో చెప్పండి... డేట్ - సమయం చెబితే డైరెక్ట్ ఫైట్ చేసుకుందాం.. రోజు ఇలా వద్దు.. మేము రెఢీ..ఒకే సారి తేల్చేద్దాం అంటూ ఛాలెంజ్ చేసారు. ఎవరో ఎమ్మెల్సీ పదవి కోసమో..మంత్రి పదవి కోసమో ఆశ పడి ఇటువంటి విధ్వంసాల ద్వారా ముఖ్యమంత్రి మెప్పి కోసం ప్రయత్నం చేస్తున్నారని చెప్పారే. సీఎంను సంతోషపెట్టేందుకు గూండాయిజం చేస్తున్నారని విమర్శించారు.
Recommended Video
పాలన బేరీజు వేయాలని సూచన
ఇలాంటి వేధింపు కేసులు వద్దని నాని సూచించారు. అదే విధంగా ప్రజలంతా గతంలో చంద్రబాబు పాలన అయిదేళ్ల కాలం.. ఇప్పుడు జగన్ పాలన సాగించిన రెండున్నారేళ్ల కాలం బేరీజు వేసుకోవాలని కోరారు. మిగిలిన రెండున్నారేళ్ల కాలంలో ఇంకా ఎటువంటి పరిస్థితులు చూడాల్సి వస్తుందోనంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు దీక్షకు మద్దతు ప్రకటిస్తున్నానని..అందరూ ఈ ప్రభుత్వం తీరు పైన అప్రమత్తంగా ఉండాలని కేశినేని సూచించారు.