దారికొస్తున్న కేశినేని ? చంద్రబాబు టూర్ కు అండగా-ఎంపీలకు ఢిల్లీ ఆతిధ్యం-వివాదాలకు తెర !
కొంతకాలంగా టీడీపీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న విజయవాడ ఎంపీ కేశినేని నాని తాజాగా ఢిల్లీలో మీడియాతో ఆఫ్ ద రికార్డ్ గా పార్టీపై, అధినేత చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబుతో విభేదిస్తూ ఆయన పార్టీ వీడటం ఖాయమని అంతా భావించారు. ఇందుకు తగినట్లుగానే ఆయన ట్వీట్లు కూడా పెట్టారు. కానీ చివరికి టీడీపీలో కొనసాగేందుకే ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
కేశినేని నాని వ్యవహారం
విజయవాడలో వైసీపీ గాలిచి ఎదురునిలిచి గత ఎన్నికల్లో టీడీపీ ఎంపీగా గెలిచిన కేశినేని నాని ఆ తర్వాత మాత్రం తన నిర్ణయాలు, వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా ఢిల్లీలో బీజేపీ వర్గాలతో ఆయన నెరుపుతున్న సంబంధాలు, వైసీపీ పెద్దలతో టచ్ లోకి వెళ్లారంటూ వస్తున్న వార్తలు కేశినేనిపై అనుమానాల్ని మరింత పెంచాయి. చివరికి నానితో విసిగిపోయిన టీడీపీ అధిష్టానం.. ఆయన స్ధానంలో సోదరుడు కేశినేని చిన్నిని రంగంలోకి దించిందనే వార్తలు కూడా వినిపించాయి. వచ్చే ఎన్నికల్లో నానికి బదులుగా చిన్నితో విజయవాడ ఎంపీగా పోటీ చేయించడం ఖాయమనే ప్రచారం కూడా జరిగింది.
వెనక్కి తగ్గిన కేశినేని ?
నిన్న మొన్నటి వరకూ పార్టీలో ఏదో జరిగిపోతోందని, బీజేపీ ఎంపీ సీఎం రమేష్ వంటి వారు చెప్పినట్లు అధినేత వింటున్నట్లు చెప్పుకొచ్చిన కేశినేని నాని.. ఆ తర్వాత తన అనుచరులు, పెద్దల సూచనతో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వచ్చే రెండేళ్లు ఎంపీగా పదవీకాలం కూడా ఉండటం, వైసీపీలోకి వెళ్లినా ఉపయోగం ఉండబోదనే అంచనాలు, విజయవాడలో వైసీపీ ఎంపీగా గెలిచే అవకాశం లేకపోవడం వంటి అంశాలతో కేశినేని దూకుడు తగ్గించి, వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది.
చంద్రబాబు టూర్ కు అండగా..
గోదావరి వరద ముంపు బాధితులను పరామర్శించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ వెళ్తున్నారు. ఆ క్రమంలో తన ఎంపీ నియోజకవర్గం పరిధిలో (ఎన్టీఆర్ జిల్లా) ఆయనకు ఘనంగా స్వాగతం పలకాలని కేశినేని నిర్ణయించారు. ఇందులో భాగంగా తన నియోజకవర్గంలో చంద్రబాబుకు పార్టీ శ్రేణులు అంతా స్వాగతం పలకాలంటూ నాని కీలక ఆదేశాలు ఇచ్చారు. దీంతో నాని చెప్పినట్లుగానే స్ధానిక టీడీపీ శ్రేణులంతా చంద్రబాబుకు స్వాగతం కూడా పలికారు. ఎన్టీఆర్ జిల్లా దాటే వరకూ చంద్రబాబు టూర్ లో పాల్గొనడం ద్వారా తామంతా ఒకటేనన్న సందేశం కూడా ఇచ్చారు.
తాత్కాలికంగా వివాదాలకు తెర ?
వాస్తవానికి టీడీపీ అధిష్టానంతో, అధినేత చంద్రబాబుతో వస్తున్న గ్యాప్ తగ్గించుకునేందుకు కేశినేని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. కానీ మధ్యలో చేరిన కోటరీ ఆయన బీజేపీలోకి వెళ్తున్నారంటూ, వైసీపీలో టచ్ లో ఉన్నారంటూ అధినేతకు ఫిర్యాదులు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అనవసరంగా గ్యాప్ పెరుగుతోందంటూ నాని అనుచరులు చెప్తున్నారు. ఇప్పుడు తాజాగా చోటు చేసుకున్న వివాదాలకు కూడా ఇవే కారణంగా తెలుస్తోంది. దీంతో ఢిల్లీలో టీడీపీకి చెందిన ఇతర ఎంపీల్ని, ఇతర పార్టీల ఎంపీలతో పాటు తన ఇంటికి రప్పించుకుని ఆతిధ్యం ఇచ్చిన కేశినేని.. ఇప్పుడు చంద్రబాబు టూర్ కు స్వాగతం పలకడంతో తాత్కాలికంగా అయినా ఈ వివాదాలకు తెరపడినట్లయింది.