మాట్లాడను, క్షమాపణ చెప్తున్నా: కేశినేని నాని యూ టర్న్
హైదరాబాద్: విజయవాడ పార్లమెంటు సభ్యుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కేశినేని నాని యూ టర్న్ తీసుకున్నారు! రెండు రోజుల క్రితం తాను చేసిన వ్యాఖ్యల పైన ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు ఆయన వివరణ ఇచ్చారు. అనంతరం ఆదివారం ఉదయం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఈ ఆరు నెలల్లో తమ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు. చంద్రబాబు జీవితకాలం సీఎంగా కొనసాగాలని ఏర్పాట్లు చేసుకున్నామని చెప్పారు. రాష్ట్రంలో రైతులకు 80 శాతం రుణమాఫీ జరిగిందని, మరో ఇరవై శాతం చేస్తామని చెప్పారు. అన్ని వర్గాలను చంద్రబాబు ముందుకు తీసుకు పోతున్నారని చెప్పారు.
విజయవాడ నగరాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. స్వర్ణాంధ్ర ప్రదేశ్ లక్ష్యంగా చంద్రబాబు ముందుకు పోతున్నారని, ఆయనకు తాము సహకరిస్తామని చెప్పారు. కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే 24 గంటల విద్యుత్ ఉందన్నారు.
క్షమాపణలు చెబుతున్నా
మొన్న తాను బహిరంగంగా మాట్లాడినందుకు క్షమాపణలు చెబుతున్నానని కేశినేని నాని చెప్పారు. తాను చేసింది తప్పేనని చెప్పారు. ఇక నుండి పార్టీ విషయాలు బహిరంగంగా మాట్లాడనని చెప్పారు. అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం లేదని, ఇక ముందు సమన్వయం చేసుకుంటామని చెప్పారు.
బహిరంగంగా మాట్లాడటం తప్పేనని, ఇక నుండి అలా మాట్లాడనని, క్షమించాలని తాను చంద్రబాబును కోరానని నాని చెప్పారు. ఏదైనా ఉంటే వ్యక్తిగతంగా కలిసి మాట్లాడాలని అధినేత సూచించారని, అలా నడుచుకుంటానని చెప్పారు. ఇక నుండి అందరం కలిసి ముందుకు పోతామన్నారు.