తల్లికి వందనం డబ్బుల కోసం చూస్తున్నారా? మీ కోసమే కీలక హెచ్చరిక!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తల్లికి వందనం పథకంలో భాగంగా ఈ నెల 22వ తేదీన నిధుల విడుదలకు ప్రభుత్వం సిద్ధమైంది. ఏపీ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న తల్లికి వందనం పథకం త్వరలో అమలు కానున్న వేళ పోలీసులు ఈ పథకం గురించి కీలక అలెర్ట్ ఇచ్చారు.
విద్యార్థుల తల్లిదండ్రులను హెచ్చరించిన కర్నూలు ఎస్పీ
ప్రభుత్వం ఈ పథకం క్రింద అర్హత ఉన్న వారి బ్యాంక్ ఖాతాలలో సొమ్ము జమ చేస్తుందని చెప్పినవేళ తల్లిదండ్రులుతమ పిల్లలు అర్హుల జాబితాలో ఉన్నారా లేదా అన్న వివరాలను సరిచూసుకుంటున్నారు. ఈ క్రమంలో సైబర్ నేరగాళ్ల విషయంలో కర్నూలు సైబర్ క్రైమ్ పోలీసులు కీలక అలర్ట్ ఇస్తున్నారు. తల్లికి వందనం నిధులు విడుదల నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులను కర్నూలు ఎస్పీ హెచ్చరించారు.

వాటిని ఓపెన్ చెయ్యొద్దు.. మోసపోతారు
ఈ పథకం విషయంలో సోషల్ మీడియా ద్వారా వచ్చే ఎటువంటి మోసపూరితమైన లింకులను ఓపెన్ చేయకూడదని, ఎటువంటి సందేశాలను నమ్మకూడదని ఎస్పీ హెచ్చరించారు. సైబర్ క్రిమినల్స్ ఈ పథకం పేరుతో తల్లిదండ్రులను మోసం చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని కర్నూలు ఎస్పీ విక్రాంత పాటిల్ సూచనలు చేశారు.
వారితో బ్యాంక్ అకౌంట్స్, ఓటీపీ వివరాలు పంచుకోకండి
అపరిచిత వ్యక్తులతో బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు, ఓటిపి వంటి వివరాలు పంచుకోకూడదని సూచించారు. తల్లికి వందనం పథకంతో పాటుగా, ఏవైనా ప్రభుత్వ పథకాల సమాచారం కోసం సమీపంలో ఉన్న స్వర్ణ గ్రామ, స్వర్ణ యార్డ్ కార్యాలయాలను సంప్రదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే ప్రభుత్వం తల్లికి వందనం పథకానికి 10120.78 కోట్ల రూపాయలను అకౌంట్లో జమ చేయనుంది.
జులై 22 నుండి తల్లుల బ్యాంక్ ఖాతాలలో తల్లికి వందనం నిధుల జమ
జూలై 22వ తేదీ నుంచి విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాలలో తల్లికి వందనం నిధులను జమ చేస్తారు. ఇంట్లో స్కూల్ కి వెళ్లే పిల్లలు ఎంతమంది ఉంటే అందరికీ కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తారు. మొత్తం 2026-27 విద్యా సంవత్సరానికి 67 లక్షల 47 వేల 190 మందికి తల్లికి వందనం సాయం అందనుంది.
13 వేల రూపాయలు విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలలో జమ
అయితే ఈ సంవత్సరం తల్లికి వందనం పథకాన్ని ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులకు జూలై నెలాఖరులోగా వర్తింప చేయనున్నారు. అంగన్వాడీ కార్యకర్తల పిల్లలకు, శానిటేషన్ వర్కర్ల పిల్లలకు కూడా ఈసారి ఈ పథకాన్ని అందించనున్నారు. ఈ పథకం కింద 13 వేల రూపాయలను విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలలో జమ చేస్తారు.












Click it and Unblock the Notifications