కోనసీమ జిల్లా ప్రజల చిరకాల వాంఛ జాతీయ రహదారి 216Eపై కీలక అప్డేట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రహదారుల విస్తరణకు ఏపీ ప్రభుత్వం ఫోకస్ చేస్తుంది. కేంద్ర సాయంతో జాతీయ రహదారుల విస్తరణ పైన కూడా ఫోకస్ చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా రవాణా సదుపాయాలను మెరుగు పరచాలనే ఉద్దేశంతో విస్తరణ పనులు చేపట్టిన సర్కార్ ఈ మేరకు కీలక అడుగులు వేస్తుంది.
జాతీయ రహదారి 216Eపై ప్రతిపాదనలు సిద్ధం చెయ్యాలని ఆదేశం
ఈ క్రమంలోనే ఏపీలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం నుండి రావులపాలెం వరకు ప్రతిపాదిత జాతీయ రహదారి 216Eను కనీసం 27 మీటర్లు ,90 అడుగులు వెడల్పుతో నాలుగు లైన్లుగా నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రహదారులు, భవనాల శాఖ ప్రిన్సిపల్ ముఖ్య కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు అధికారులను ఆదేశించారు.

విస్తృత ప్రమాణాలతో జాతీయ రహదారి అభివృద్ధి
నేడు అమలాపురం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో అమలాపురం ఎంపీ, ఎమ్మెల్యేలు, జాతీయ రహదారుల ఇంజనీర్లు, రెవెన్యూ ఉన్నతాధికారులతో కలిసి నూతన ప్రతిపాదనలపై చర్చించారు. కోనసీమ జిల్లా ప్రజల చిరకాల వాంఛగా ఉన్న ఈ జాతీయ రహదారిని విస్తృత ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇది కోనసీమ జిల్లా ప్రగతికి దోహదం చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.
నాలుగు లైన్ల రహదారి లక్ష్యం
ప్రస్తుతం ఉన్న రహదారి సామర్థ్యం పెరుగుతున్న రవాణా అవసరాలకు సరిపోకపోవడంతో 27 మీటర్ల వెడల్పుతో నాలుగు లైన్లుగా ఈ జాతీయ రహదారి నిర్మాణం చేయాలని ప్రతిపాదించారు. ఇది పూర్తయితే అమలాపురం-రావులపాలెం మధ్య ప్రయాణం కూడా ఈజీ అవుతుంది. అంతేకాదు వాణిజ్య, వ్యవసాయ రవాణాకు ఊతం లభిస్తుంది.
భూసేకరణ, నష్టపరిహారంపై ఆదేశం
రహదారి విస్తరణ కోసం అవసరమైన భూసేకరణ, ప్రస్తుతం ఉన్న భవనాల తొలగింపు, నష్టపరిహార చెల్లింపులపై కూడా సమగ్ర సర్వే నిర్వహించి ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పారదర్శక విధానంలో ఈ భూసేకరణ ప్రక్రియ చేపట్టాలని సూచించారు.
ప్రాంతీయ అభివృద్ధికి దోహదం
ఈ జాతీయ రహదారి విస్తరణతో కోనసీమ జిల్లా అభివృద్ధికి కొత్త దిశ, దశ లభించనుంది. రవాణా సౌకర్యాలు మెరుగుపడి, పారిశ్రామిక, వాణిజ్య రంగాలకు ప్రోత్సాహం లభించడంతో పాటు పర్యాటక రంగానికి కూడా మేలు చేకూరనుంది. మరి ఈ జాతీయ రహదారిపై అధికారులు రంగంలోకి దిగటంతో కోనసీమ జిల్లా వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications