రాయిటర్స్ కథనంపై ప్రతిపక్షాల గగ్గోలు, కియా ప్లాంట్ ఎక్కడికీ వెళ్లడం లేదు: మంత్రి బొత్స క్లారిటీ
ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడపై మంత్రి బొత్స సత్యనారాయణ ఫైరయ్యారు. ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తూ ముందుకెళ్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం చేసే మంచి పనులను ప్రశంసించని చంద్రబాబు, లోకేశ్.. విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. రాష్ట్రాభివృద్ధి ఇంచు కూడా ముందుకెళ్లొద్దని చంద్రబాబు అనుకొంటున్నారని పేర్కొన్నారు. నిరుద్యోగ యవతకు ఉపాధి కల్పించొద్దని అనుకొంటున్నారని మండిపడ్డారు. ఆయన చేసే పనులను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.
Recommended Video

కియా వెళ్లడం లేదు..
రాష్ట్రం నుంచి కియా ప్లాంట్ వెళ్లడం లేదని మంత్రి బొత్స క్లారిటీ ఇచ్చారు. కానీ రాయిటర్స్ కథనం పట్టుకొని ప్రతిపక్షం గగ్గోలు పెడుతోందన్నారు. రాయిటర్స్ కథనంపై ఎలాంటి చర్యలు తీసుకోవాలా అని ఆలోచిస్తున్నామని చెప్పారు. ఏపీ నుంచి కియా వెళ్తుందని కంపెనీ చెబుతోందంటున్న రాయిటర్స్.. ఇవాళ సవరణ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. ఏ ఆధారంతో కథనం ప్రచురించారని బొత్స సత్యనారాయణ అడిగారు. వారికి చంద్రబాబు నాయుడు, లేదా లోకేశ్ ఫోన్ చేసి చెప్పి ఉంటారని ఆరోపించారు.

4 లక్షల మందికి ఉపాధి..
రాష్ట్రంలో 4 లక్షల మందికి ఉద్యోగం కల్పించింది చంద్రబాబు నాయుడుకు కనిపించడం లేదా అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. చేస్తున్న మంచి పనులను అడ్డుకొనేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. తమ ప్రసార సాధనాలతో అబద్దాన్ని నిజం చేయాలని చూస్తున్నారని ఫైరయ్యారు. చంద్రబాబు నాయుడుకు రాష్ట్ర ప్రయోజనాలు పట్టవని విమర్శించారు. ఎప్పుడూ గోబెల్స్ ప్రచారం చేస్తారని ధ్వజమెత్తారు.

కొత్తగా 4 లక్షల పెన్షన్లు..
గత ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్లే గాక కొత్తగా 4 లక్షల పెన్షన్లు అందజేస్తున్నామని చెప్పారు. మొత్తంగా అన్నివర్గాల వారికి సుమారు 6 లక్షల పైచిలుకు పెన్షన్లు ఇస్తున్నామని చెప్పారు. అయితే ఇటీవల కొన్ని పెన్షన్లు తొలగించిన మాట వాస్తవమేనని.. కానీ ఆ పెన్షన్లను కూడా తిరిగి ఇచ్చేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఆ ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి బొత్స వివరించారు.












Click it and Unblock the Notifications