ప్లాన్ మీద ప్లాన్ వేసి, కటకటాల వెనక్కి (ఫొటో)
విశాఖపట్నం: వ్యసనాలకు బానిసలై, సులువుగా డబ్బులు సంపాదించేందుకు కిడ్నాప్లకు, దోపిడీలకు ప్రయత్నించిన నలుగురు యువకులు కటకటాల పాలయ్యారు. వారి ప్రయత్నానికి విశాఖపట్నం సిసిఎస్ పోలీసులు కళ్లెం వేశారు. ఈ వివరాలను క్రైం ఎడిసిపి ఎస్ వరదరాజులు శుక్రవారం మీడియాకు వివరించారు.
తాటిచెట్లపాలేనికి చెందిన గనిరెడ్డి రాము కారు డ్రైవర్గా పనిచేసేవాడు. అతనికి అదే ప్రాంతానికి చెందిన సప్పా దాలిరాజు, గోపాలపట్నానికి చెందిన కొయిలాడ శివకుమార్, ఎండి రఫీ, సంతోష్, జానీ అలియాస్ దుంపల గణేష్, విక్రమ్ స్నేహితులు. వీరంతా వ్యసనాలకు బానిసలయ్యారు.
కెజిహెచ్ వద్ద గల సూర్య ఆస్పత్రి వైద్యుడిని కిడ్పాన్ చేయాలని ప్రణాళిక వేసుకున్నారు. అందుకు అవసరమైన వస్తువులను పూర్ణా మార్కెట్లో కొనుగోలు చేశారు. గత నెల 14వ తేదీ రాత్రి ఎనిమిదిన్నర గంటలకు సూర్య ఆస్పత్రి వద్ద మాటు వేశారు.

ఆ సమయంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండడంతో వారి పథకం పారలేదు. మరుసటి రోజు మధ్యాహ్నం భిమిలీ వెళ్లి అక్కడ ఓ బంగారు దుకాణంలో రెక్కీ నిర్వహించారు. రాత్రి దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో దుకాణంలో సిబ్బంది ఉండడంతో విరమించుకున్నారు.
దాంతో ఆగకుండా మరో ప్లాన్ వేశారు. మురళీనగర్లో వృద్ధదంపతులు ఉంటున్న ఇంటిని ఎంచుకున్నారు. జనసంచారం ఎక్కువగా ఉండడంతో అక్కడ దోపిడీ సాధ్యం కాలేదు. అక్కయ్యపాలెం ఆబిద్నగర్లో ఓ చిన్నారిని కిడ్నాప్ చేద్దామని పథకం వేసుకున్నారు. ఇది కూడా బెడిసికొట్టింది.
శ్రీకాకుళం జిల్లాలోని కిమ్స్ ఆస్పత్రి వైద్యుడ్ని కిడ్నాప్ చేయాలని పథకం వేసి విఫలమయ్యారు. శుక్రవారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో జిల్లా పరిషత్ దరి అంకోశా హాల్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరిలో నలుగురిని సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంతోష్, జానీ, విక్రమ్ తప్పించుకున్నారు. నిందితుల నుంచి మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications