దాసరి కోసం ప్రార్థించండి: మోహన్ బాబు, మరో 24గంటలు అబ్జర్వేషన్లో
దాసరిని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రజలంతా మంచి మనసుతో దాసరి ఆరోగ్యం కోసం కోసం ప్రార్థించాలని మోహన్ బాబు కోరారు.
హైదరాబాద్: ఊపిరితిత్తులు, కిడ్నీ, మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్న మాజీ కేంద్రమంత్రి దాసరి నారాయణరావు ప్రస్తుతం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న సంగతి తెలిసిందే. కిమ్స్ హాస్పిటల్ సీఈవో బొల్లినేని భాస్కర్ రావు దాసరి తాజా ఆరోగ్య పరిస్థితి గురించి మీడియాకు వివరించారు.
దాసరికి ఈరోజు డయాలసిస్ చేయాల్సిన అవసరం రాలేదని భాస్కర్ రావు చెప్పారు. అయితే మరో 24 గంటల పాటు ఆయన్ను అబ్జర్వేషన్ లో ఉంచుతున్నట్టుగా తెలిపారు. దాసరి ఆరోగ్యంపై ఆందోళన అవసరం లేదని చెప్పారు.
దాసరి కోసం ప్రార్థించండి: మోహన్ బాబు
దాసరి ఆసుపత్రిలో చేరినప్పటినుంచి నిత్యం ఆసుపత్రికెళ్లి ఆయన బాగోగులను చూసుకుంటున్నారు సినీ నటుడు మోహన్ బాబు. బుధవారం నాడు కూడా ఆయన కిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు.
దాసరిని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రజలంతా మంచి మనసుతో దాసరి ఆరోగ్యం కోసం ప్రార్థించాలని ఆయన కోరారు. ఆయన ఆరోగ్యం బాగుపడాలని షిర్డీ సాయినాథుడిని వేడుకునేందుకు వెళ్తున్నానని అన్నారు.
దాసరి ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వస్తే.. ఎన్నో కుటుంబాలు బాగుపడుతాయని మోహన్ బాబు అన్నారు. ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.