మంత్రులకు కాల్మనీ సెగ: 'వడ్డీ వ్యాపారంపై మంత్రి అచ్చెన్నాయుడు నోరు విప్పాలి'
అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న కాల్మనీ వ్వవహారం చిలికి చిలికి గాలివానలా ఏపీ సీఎం చంద్రబాబు మెడకు చుట్టుకునేలా కనిపిస్తోంది. బెజవాడలో వెలుగు చూసిన ఈ కాల్మనీ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
తాజాగా ఈ కాల్మనీ వ్యవహారంలోకి మంత్రులను కూడా లాగుతున్నారు. ఉత్తరాంధ్రలో కింజరాపు కుటుంబీకులే అతి పెద్ద వడ్డీ వ్యాపారస్తులని శ్రీకాకుళం వైయస్ఆర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంఛార్జి దువ్వాడ శ్రీనివాస్ ఆరోపించారు. శుక్రవారం ఆయన శ్రీకాకుళంలో విలేకరులతో మాట్లాడుతూ బెజవాడ కాల్మనీ వ్యవహారంలో అధికార పార్టీలకు చెందిన నేతలే అధికంగా ఉన్నారన్నారు.
వారిని రక్షించేందుకు సీఎం చంద్రబాబు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కాగా సుమారు 25 ఏళ్ల క్రితం వందల కోట్ల రూపాయలతో ఉత్తరాంధ్రలో టీడీపీ నేత కింజారపు ఎర్రనాయడుతో ఈ వడ్డీ వ్యాపారం మొదలైందని ఆయన ఆరోపించారు.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ తదితర ప్రాంతాల్లో పలు షాపింగ్మాళ్లు, హోటళ్లు, రైస్ మిల్లులు తదితర వ్యాపారాలతో పాటు పలువురు నేతలతో ఎర్రన్నాయుడు వడ్డీ వ్యాపారాలు సాగించారని దువ్వాడ తెలిపారు. అసలు నేరస్తులను వదలిపెట్టి చిన్న చిన్న వడ్డీ వ్యాపారులపై పోలీసులు దాడు చేయడం సిగ్గుచేటన్నారు.
కింజారపు కుటుంబీకులు చేసిన వడ్డీ వ్యాపారాలపై మంత్రి అచ్చెన్నాయుడు నోరు విప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే చిరు వడ్డీ వ్యాపారులపై దాడులు చేయడం కాదని కింజారపు కుటుంబీకుల ఇళ్లల్లో సోదాలు చేసి వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.