కిరణ్ ధిక్కారం!: విభజన సులువుకాదు, ఉద్యోగ సమస్య
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీపై మరోసారి ధిక్కార స్వరం వినిపించారు! రాష్ట్ర విభజన అంత సులువు కాదని, విభజిస్తే ఎన్నో సమస్యలు వస్తాయని వాటిని ఎవరు పరిష్కరిస్తారని కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం ప్రశ్నించారు. రాష్ట్రంలోని లక్షా అరవై వేల మంది ఉద్యోగులు ఎవరు ఏ జోన్లోకి వస్తారో ఎలా నిర్ణయిస్తారని ఆయన ప్రశ్నించారు. ఆయన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆయన ఉద్యోగ సమస్యలపై మాట్లాడారు.
ఉద్యోగులకు భద్రత లేని పరిస్థితి ఎందుకు వచ్చిందన్నారు. జోనల్ విధానంలో ముప్పై శాతం మంది ఉద్యోగులు బయటి ప్రాంతాల వారు ఉన్నారన్నారు. ఉద్యోగుల అంశానని ఎలా పరిష్కరిస్తారనే విషయాన్ని స్పష్టం చేయాలన్నారు. హైదరాబాదు చుట్టు పక్కల గల ప్రయివేటు కంపెనీలలోని ఉద్యోగులకు ఎలాంటి హామీ ఇస్తారని ప్రశ్నించారు. అన్ని సంస్థలు హైదరాబాదులోనే కేంద్రీకృతమయ్యాయన్నారు. విభజన తర్వాత పెన్షనర్ల పింఛన్ ఎలా చెల్లిస్తారన్నారు. 24 శాతం మంది చదువు కోసమే హైదరాబాదుకు వస్తున్నారన్నారు.
రాష్ట్రం కలిసి ఉండాలని నాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ బందమేర్పరిస్తే, ఇందిరా గాంధీ దానిని మరింత బలంగా చేసిందన్నారు. రాష్ట్ర విభజన అంత సులువైన అంశం కాదన్నారు. ఈ బంధం విడిపోవాలంటే ఎన్నో చిక్కుముడులు ఉన్నాయన్నారు.
పార్టీ నిర్ణయంపై ముఖ్యమంత్రి
సిడబ్ల్యూసి నిర్ణయం తమకు ముఖ్యమేనని అయితే నాడు నెహ్రూ, ఇందిరా గాంధీల నిర్ణయాన్ని ఏం చేస్తారని ప్రశ్నించారు. విడిపోలేనంత గట్టిగా నెహ్రూ ఇరు ప్రాంతాలకు ముడి వేశారన్నారు. విడిపోవాలంటే చాలా ఇబ్బందులు ఉన్నాయని, వాటిని పరిష్కరించాకే ముందుకు వెళ్లాలన్నారు. సిడబ్ల్యూసి నిర్ణయం శిలా శాసనం అన్న వారు నెహ్రూ, ఇందిర నిర్ణయాలు తప్పంటారా అని ప్రశ్నించారు.
ఎంతో శ్రమ, ఎన్నో చర్చల అనంతరం ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడిందన్నారు. ఈ రాష్ట్రం ఒక్కరోజుతో వచ్చిన విశాలాంధ్ర కాదన్నారు. సిడబ్ల్యూసి నిర్ణయాన్ని తాము గౌరవిస్తామని అయితే అదే శాసనం కాదన్నారు. అదే శాసనం అయితే నెహ్రూ, ఇందిర చెప్పింది శాసనం కాదా అన్నారు.