సోనియాపై పయ్యావుల వ్యాఖ్య: తిప్పికొట్టిన కిరణ్ రెడ్డి
హైదరాబాద్: రాష్ట్ర విభజనపై పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెసు సోనియా గాంధీపై వచ్చిన విమర్శను తిప్పికొట్టారు. రాష్ట్ర విభజనపై నిర్ణయం జరిగిన తర్వాత బహుశా తొలిసారి కిరణ్ కుమార్ రెడ్డి సోనియాకు మద్దతుగా మాట్లాడారు. శాసనసభలో సోమవారం తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చ జరుగుతన్న సమయంలో తెలుగుదేశం సభ్యుడు పయ్యావుల కేశవ్ సోనియాపై చేసిన వ్యాఖ్యను ఆయన తిప్పికొట్టి తన విధేయతను ప్రకటించుకున్నారు.
సోనియా గాంధీని పయ్యావుల కేశవ్ ఇటాలియన్ మహిళగా అభివర్ణించారు. దాన్ని కిరణ్ కుమార్ రెడ్డి వ్యతిరికేస్తూ - సోనియాకు భారతదేశ పౌరసత్వం ఉందని చెప్పారు. ఆ విషయాన్ని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని ఆయన గుర్తు చేశారు. ప్రధాని పదవిని చేపట్టడానికి సోనియా నిరాకరించిన తర్వాతనే పివి నర్సింహారావు ప్రధాన మంత్రి అయ్యారని ఆయన అన్నారు.
సోనియా గాంధీ పార్లమెంటు సభ్యురాలిగా, యుపిఎ చైర్ పర్సన్గా కొనసాగుతున్నారని ఆయన అన్నారు. విభజన నిర్ణయానికి బాధ్యులెవరో తాను మాట్లాడేటప్పుడు చెప్తానని కిరణ్ రెడ్డి అన్నారు. వ్యక్తిగత వ్యాఖ్యలకు వెళ్లకుండా ప్రస్తుతాంశంపై దృష్టి సారించాలని ఆయన సభ్యులకు సూచించారు.
కాగా, రాష్ట్ర విభజనపై పార్టీ అధిష్టానాన్ని వ్యతిరేకిస్తున్న రాయలసీమకు చెందిన మంత్రి శైలజానాథ్ కూడా సోనియాపై పయ్యావుల చేసిన వ్యాఖ్యపై తీవ్రంగా మండిపడ్డారు. ఇందిరాగాంధీని, సోనియా గాంధీని విమర్శించే నైతిక హక్కు తెలుగుదేశం పార్టీకి లేదని ఆయన అన్నారు.