కిరణ్ ద్విముఖ వ్యూహం: చెప్పకుండానే.. పెదవి విరుపు
హైదరాబాద్: తెలంగాణ బిల్లు పైన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ద్విముఖ వ్యూహంతో వెళ్తున్నారు. బిల్లును వెనక్కి పంపించాలని నోటీసు ఇచ్చి సంచలనం సృష్టించిన కిరణ్ తాజాగా... మరోసారి గడువు పెంచాలని కోరుతూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాయాలని నిర్ణయించారు. సోమవారం సభ వాయిదా పడిన అనంతరం సీమాంద్ర మంత్రులు, ఇతర నేతలు కిరణ్ రెడ్డితో భేటీ అయ్యారు.
ఈ భేటీలో తెలంగాణ ముసాయిదా బిల్లును ఓడించడమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. అదే సమయంలో రాష్ట్రపతికి గడువు పెంచాలని మరోసారి లేఖ రాయాలని కిరణ్ నిర్ణయించారని సమాచారం. సభలో బిల్లు పైన ఓటింగ్ జరిగి ఓడించాలని కిరణ్ గట్టిగా భావిస్తున్నారు. తెలంగాణ ప్రాంత మంత్రులు పోడియం వద్దకు వెళ్లి సభను అడ్డుకున్న చరిత్ర లేదని ఈ సందర్భంగా కిరణ్ ఆవేదన వ్యక్తం చేశారట.
కిరణ్పై అసంతృప్తి
మరోవైపు ముఖ్యమంత్రి పైన పలువురు సీమాంధ్ర నేతలు అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది. తమకు కూడా తెలియకుండా కిరణ్ నోటీసు ఇవ్వడంపై పలువురు అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్నారట.
నోటీసుపై నిర్ణయం స్పీకర్, చైర్మన్లదే
శాసన సభలో ముఖ్యమంత్రి, మండలిలలో సి రామచంద్రయ్య ఇచ్చిన నోటీసులపై తుది నిర్ణయం స్పీకర్, చైర్మన్లదేనని తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసన మండలి పక్ష నేత యనమల రామకృష్ణుడు అన్నారు. రాష్ట్రానికి పంపించింది బిల్లో, డ్రాఫ్టో చెప్పాలని డిమాండ్ చేశారు. పదే పదే సభను వాయిదా వేయడం సరికాదన్నారు. బిల్లు పైన ఓటింగ్ కచ్చితంగా ఉంటుందన్నారు. మరోవైపు అసెంబ్లీ మంగళవారానికి వాయిదా పడింది.