23తర్వాత కిరణ్ పార్టీ, జగన్కు బుద్ధి చెప్పారు: దేవినేని
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, విజయవాడ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్లు కలిసి ఈ నెల 23వ తేదీన పార్టీ పెట్టే యోచనలో ఉన్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వర రావు సోమవారం అన్నారు. అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం ఆయన మీడియా పాయింటు వద్ద మాట్లాడారు.
కిరణ్, లగడపాటిలు ఇరవై రోజుల తర్వాత పార్టీ పెట్టే అవకాశముందన్నారు. ఆ పార్టీ ద్వారా నాలుగు సీట్లను గెలిచి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఇవ్వాలని చూస్తున్నారన్నారు. అధిష్టానం ఎలాగైనా రాష్ట్రంలో కొన్ని సీట్లను గెలవడం ద్వారా గట్టెక్కాలని భావిస్తోందని విమర్శించారు.
ఎపిఎన్జీవో ఎన్నికల్లో ఉద్యోగులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, కడప పార్లమెంటు సభ్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి సరైన బుద్ధి చెప్పారన్నారు. ఉద్యోగ సంఘాల ఎన్నికలలో జగన్కు పనేమిటని ప్రశ్నించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అవసరాల కోసం వైయస్ జగన్ చెప్పినట్లు ఎపిఎన్జీవో అధ్యక్షులు అశోక్ బాబు చేయాలా అని ప్రశ్నించారు.
శాసనమండలి వాయిదా
సోమవారం శాసన మండలి సమావేశాలు ప్రారంభమైన కాసేపటికే వాయిదాపడ్డాయి. ఇరు ప్రాంతాల సభ్యులు, ఆందోళన, నినాదాలతో సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దీంతో కొద్ది సేపటికే చైర్మన్ సభను వాయిదా వేశారు.