KGF-2 బడ్జెట్ కంటే ఆయన ఇల్లు రూ.2 కోట్లు తక్కువ!!
టాటా సన్స్ గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ రూ.98 కోట్ల విలువచేసే ఇంటిని కొనుగోలు చేశారు. ముంబయిలోని పెద్దార్రోడ్డులోని ఒక విలాసవంతమైన అపార్ట్మెంట్లో ఈ కొనుగోలు జరిగింది. ఒక లగ్జరీ డూప్లెక్స్ హౌస్ కోసం ఇటీవల కాలంలో రూ.100 కోట్లు ఎవరూ కేటాయించలేదని, ముంబయిలో ఇదే అత్యంత పెద్ద లావాదేవీ అని రియల్ ఎస్టేట్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
ఆరువేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ అపార్ట్మెంట్లో చంద్రశేఖరన్ కుటుంబం 11, 12 అంతస్తులను కొనుగోలు చేసింది. ఐదు సంవత్సరాల నుంచి వారు ఈ ఇంట్లోనే నివసిస్తుండటం గమనార్హం. అద్దెకు ఉన్న ఇంటినే చంద్రశేఖరన్ తన భార్య లలిత, కుమారుడు ప్రణవ్ పేరుమీద కొనుగోలు చేశారు. అద్దెకు ఉండే సమయంలోనెలకు రూ.20 లక్షలు చెల్లించారు. టాటా సన్స్ చైర్మన్గా మరో ఐదు సంవత్సరాలపాటు కొనసాగనున్నారు. దేశంలోనే అత్యధిక వేతనం తీసుకుంటున్న కార్పొరేట్ బాసుల్లో చంద్రశేఖరన్ ఒకరు. ఆయన వార్షికాదాయం రూ.91 కోట్లు.
ముంబయికి చెందిన జీవేష్ డెవలపర్స్ ప్రయివేట్ లిమిటెడ్ అధినేత సమీర్ భోజ్వానీ ఈ టవర్ను 2008లో నిర్మించారు. 2017 ఫిబ్రవరి 21వ తేదీ నుంచి ఈ ఇంట్లోనే చంద్రశేఖరన్ కుటుంబం అద్దెకు ఉంటోంది. ఇటీవలే విడుదలైన సంచలన విజయాన్ని సాధించిన కేజీఎఫ్-2 చిత్రం బడ్జెట్ రూ.100 కోట్లు. ఒక భారీ చిత్రానికి కేటాయించిన బడ్జెట్ వ్యయంతో చంద్రశేఖరన్ ఇంటిని కొనుగోలు చేశారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. వివాదరహితుడు, సౌమ్యుడు అయిన చంద్రశేఖరన్ రూ.98 కోట్లతో ఇంటిని కొనుగోలు చేసి ఒక్కసారిగా వార్తల్లో నిలవడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఏదేమైనాకానీ ఒక ఖరీదైన ఇంటి కొనుగోలుతో అందరినీ చంద్రశేఖరన్ సర్ప్రైజ్ చేశారు.