చంద్రబాబు సభలకు అనుమతివ్వొద్దు-కేసీఆర్ గొప్పోడే కానీ బీఆర్ఎస్ ! కొడాలి నాని కామెంట్స్..
ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు సభల్లో వరుసగా తొక్కిసలాటలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వానికి మాజీ మంత్రి కొడాలి నాని ఇవాళ కీలక సూచన చేశారు. చంద్రబాబు తీరును తీవ్రంగా తప్పుబట్టిన కొడాలి నాని.. సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే ఏపీలో కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ రాజకీయంపైనా కొడాలి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో కొడాలి కామెంట్స్ చర్చనీయాంశమవుతున్నాయి.

చంద్రబాబు సభలపై కొడాలి నాని
చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని జనానికి తెలుసని, ఇప్పుడు ఏ కార్యక్రమాలు చేసినా అధికారం రాదని వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని తెలిపారు. వరుసగా కందుకూరు, గుంటూరులో చంద్రబాబు నిర్వహించిన రోడ్ షో, సభల్లో తొక్కిసలాటలు చోటు చేసుకోవడంపై కొడాలి తీవ్రంగా స్పందించారు. ఎయిర్ పోర్టులో దిగి పార్లమెంటు నియోజకవర్గంలోని ఏడు సీట్లలో నేతలు వచ్చి వందల కార్లలో, పది వేల మందిని పోగేస్తున్నారని, జనానికి తాయిలాలు చూపి సభలకు తెస్తున్నారని కొడాలి విమర్శించారు. డబ్బులిచ్చి సభలకు తెస్తున్నారని, ఇరుకు సందుల్లో సభలు పెట్టి ప్రమాదాలకు కారణమవుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు 420, జనాన్ని ఇబ్బందిపెట్టే కార్యక్రమాలు చేస్తున్నారని, పబ్లిసిటీ కోసమే ఇదంతా చేస్తున్నారన్నారు. మెయిన్ రోడ్లను వదిలిపెట్టి ఇరుకుసందుల్లో సభలు పెడతారు, జనం వస్తున్నారని ప్రచారం చేసుకుంటారన్నారు.

చంద్రబాబు సభలకు అనుమతివ్వొద్దు
చంద్రబాబుకు ప్రజలు పట్టేది బ్రహ్మరథం కాదని, ఆయన పట్టేది యమరథం అని కొడాలి విమర్శించారు. చంద్రబాబు సభలకు అనుమతివ్వొద్దని వైసీపీ సర్కార్ కు ఆయన సూచించారు. చంద్రబాబు కాన్వాయ్, కార్లపై పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. 20, 30 వేల మందిని తీసుకొచ్చి సభలు ఎలా పెడతారని ప్రశ్నించారు.పబ్లిసిటీ, రాజకీయ అవసరాల కోసం జనాన్ని చంపుతావా అని ప్రశ్నించారు. నీ భార్యను తిట్టారని ఏడ్చావు, ఇప్పుడు ఆ మహిళలు నీ కుటుంబ సభ్యులతో సమానం కాదా అని అడిగారు. నీ భార్య ఒక్కటే ఆడదా, వాళ్లు ఆడోళ్లు కాదా అని చంద్రబాబును నిలదీశారు. చంద్రబాబు నీచుడు, ఆడోళ్లను అడ్డం పెట్టుకుని అధికారంలోకి రావాలనుకుంటున్నాడని కొడాలి విమర్శించారు.

చంద్రబాబుకు అధికారమిస్తే
చంద్రబాబుకు 2024లో గొయ్యి తీసి పాతి పెట్టకపోతే ఈ రాష్ట్రంలో చాలా రాజకీయ విధ్వంసాలు సాగుతాయని కొడాలి హెచ్చరించారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే లక్షల మందిని చంపుతాడని, సంక్షేమ పథకాలకు కోత పెడతాడని కొడాలి తెలిపారు. కోతల రాయుడు, గతంలో ఇచ్చిన డ్వాక్రా రుణాల హామీ నెరవేర్చలేదన్నారు రైతులకు ఇచ్చిన మాఫీ నెరవేర్చలేదని, అందుకే ఎన్నికల్లో ఓడించారన్నారు. మొదటి, రెండో, మూడో సంతకం బెల్టు షాపులు తీసేస్తానని, పర్మిట్ రూమ్ లు ఇచ్చిన చరిత్ర చంద్రబాబుదన్నారు. పనీ పాటలేని ఆలపాటి రాజా వంటి వ్యక్తులు, ఊరూపేరూ లేని ఫౌండేషన్ పెట్టిన కార్యక్రమంలో లారీలు పెట్టి, టోకెన్లు పంచితే, అవి అందవని మహిళలు తోసుకుని వారి చావుకు కారణమయ్యారని, బుద్ధున్న వాళ్లెవరైనా ఇలాంటి కార్యక్రమాలకు వెళతారా అని ప్రశ్నించారు. 30 వేల మందిని ఓ మీటింగ్ కు పిలిచి ఇలాంటి కార్యక్రమాలు పెడతారా అని అడిగారు. పోలీసుల వైఫల్యం, ప్రభుత్వ వైఫల్యమా, చంద్రబాబును గడ్డలూడదీసి కొట్టాలా అని అడిగారు. ఇవన్నీ 420 కార్యక్రమాలు, 250,350 చీరలు, పప్పు, ఉప్పు ఎన్ని రోజులు వస్తాయని ప్రశ్నించారు. చంద్రబాబుకు 70 ఏళ్ల వయసులో అధికారంలోకి రాకపోతే రాజకీయ భవిష్యత్ ఉండదని, పార్టీ ఉండదని, టీడీపీ క్యాడర్ లో అలర్ట్ కోసం ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఇందులో టీడీపీ కార్యకర్తలు, సాధారణ ప్రజలు, ఎన్నారైలూ బలైపోతున్నారన్నారు.

బీఆర్ఎస్ ఎఫెక్ట్ ఉండదన్న కొడాలి
కేసీఆర్ జాతీయ పార్టీ బీఆర్ఎస్ పైనా కొడాలి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. కేసీఆర్ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారని, ఓ రాష్ట్రాన్ని సాధించి రెండుసార్లు అధికారంలోకి వచ్చిన వ్యక్తి కేసీఆర్ అని కొడాలి తెలిపారు. ఆయనకు రాజకీయ పరిజ్ఞానం లేదని చెప్పలేమన్నారు. జాతీయ రాజకీయాలపై, దేశంలో విధానాలపై ఆయనకు అవగాహన ఉందన్నారు. అయితే కేంద్రంలో అధికారంలోకి రావాలని కేసీఆర్ ప్రయత్నిస్తూ ఉండొచ్చన్నారు. కానీ ఏపీకి సంబంధించినంతవరకూ విభజనలో కేసీఆర్ పాత్ర ఉందని ఏపీ ప్రజలు భావిస్తున్నారన్నారు. ప్రతీ ఎన్నికల్లో ప్రజల మైండ్ సెట్ ఒకేలా ఉండదని, ఏపీలో బీఆర్ఎస్ పెద్దగా ప్రభావం చూపుతందని అనుకోనన్నారు. వైసీపీకి ఎలాంటి పొత్తుల్లేవని, ఏపీ సంక్షేమం కోసం, ఏపీకే పరిమితమైన పార్టీ తమదన్నారు. వైసీపీ కేంద్రంలో పరిస్దితుల ఆధారంగా అక్కడి పార్టీలకు మద్దతిస్తుందన్నారు. బీఆర్ఎస్ కు వైసీపీ మద్దతిస్తుందా లేదా అనేది చెప్పలేనన్నారు.












Click it and Unblock the Notifications