చంద్రబాబుకు శవరాజకీయాలు పుట్టుకతోనే; మైండ్ చెడిపోయి పిచ్చివాగుడు: కొడాలి నాని ఆగ్రహం
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీ మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రజలు శిక్ష విధించినా చంద్రబాబుకు సిగ్గు రావడంలేదని మండిపడిన కొడాలి నాని మహిళా దినోత్సవాన్ని కూడా రాజకీయ సభలా విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు మానసికంగా దెబ్బతిన్నాడు అని, ఆయన మైండ్ చెడిపోయిందని కొడాలి నాని వ్యాఖ్యానించారు.
చంద్రబాబుకు శవరాజకీయాలు పుట్టుకతోనే వచ్చాయి
చంద్రబాబుకు శవ రాజకీయాలు చేయటం పుట్టుకతో వచ్చాయని నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ఎవరు చచ్చిపోతారా.. వాళ్ల శవాల దగ్గరకు వెళ్లి రాజకీయం చేద్దామా అని చంద్రబాబు ఎదురుచూస్తున్నాడని మంత్రి కొడాలి నాని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మానసిక స్పృహ కోల్పోయి పిచ్చి వాగుడు వాగుతున్నాడు అంటూ విమర్శించారు. అసెంబ్లీకి రాకుండా ఇంటిదగ్గర కూర్చున్నాడని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రబాబు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసి ఓర్చుకోలేకపోతున్నాడు అని విమర్శించారు.
చంద్రబాబుకు మైండ్ చెడిపోయింది
సీఎం జగన్ పై సంబంధం లేని అంశాలన్నింటినీ రుద్దాలని చూస్తున్నారంటూ కొడాలి నాని మండిపడ్డారు. మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చిన్న వయసులోనే ఉన్నతస్థానానికి వచ్చాడు అనే ఇంగిత జ్ఞానం చంద్రబాబుకు లేదని కొడాలి నాని పేర్కొన్నారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడైనా ఎన్నికలకు వెళ్లవచ్చని చంద్రబాబు మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కొడాలి నాని చంద్రబాబుకు మైండ్ చెడిపోయిందంటూ, బుర్ర పని చేయడం లేదంటూ విమర్శలు గుప్పించారు.
అన్ని ఎన్నికల్లో గెలిచింది వైసీపీనే
రెండున్నరేళ్లలో జరిగిన అన్ని ఎన్నికల్లోనూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచిందని కొడాలి నాని పేర్కొన్నారు. ప్రజలు టిడిపిని ఆదరించడం లేదని కొడాలి నాని అభిప్రాయం వ్యక్తం చేశారు. సిగ్గులేకుండా కోర్టుకు వెళ్లి 21 మున్సిపాలిటీల ఎన్నికలను అడ్డుకున్నారని, కోర్టు జడ్జిమెంట్ రాగానే ఎన్నికలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని కొడాలి నాని తెలిపారు. 21 మునిసిపాలిటీలలో ప్రజలతీర్పు ఎలా ఉంటుందో చంద్రబాబు చూస్తాడు అంటూ కొడాలి నాని పేర్కొన్నారు.
జగన్ కు మంచిపేరు .. చంద్రబాబు ఓర్చుకోలేకనే ఇలా రాద్దాంతం
జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు రావడం తెలుగుదేశం పార్టీ నేతలెవరూ తట్టుకోలేక పోతున్నారని, కావాలనే ప్రతి విషయానికి అనవసర రాద్ధాంతం చేస్తున్నారని కొడాలి నాని విమర్శించారు. ఎన్టీఆర్ కేవలం నిమ్మకూరుకు మాత్రమే చెందిన వ్యక్తి కాదని, విజయవాడ కేంద్రంగా ఏర్పడిన జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టారని, అన్ని రకాల సౌలభ్యాలు ఉన్న విజయవాడకు ఎన్టీఆర్ పేరు పెడితే తప్పేంటి అంటూ కొడాలి నాని ప్రశ్నించారు. విజయవాడ ఏమైనా పక్క దేశంలో ఉందా చెప్పాలంటూ కొడాలి నాని టిడిపి నేతలను నిలదీశారు.