జగన్ 4నెలలపై కోడెల కౌంటర్: బ్రహ్మాస్త్రంపై లగడపాటి
తమ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన రుణమాఫీ ఎలా సాధ్యం కాదో జగన్ చెప్పాలన్నారు. అసెంబ్లీలో తెలంగాణ ముసాయిదా బిల్లు పైన చంద్రబాబును మాట్లాడించకుండా కుట్ర చేశారన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల్లో జగన్ బలహీనపడుతున్నందునే కేంద్రం కిరణ్ ను తెరమీదకు తెచ్చి నాటకం ఆడుతోందని ఆరోపించారు.
బ్రహ్మాస్త్రాలు ఉన్నాయి: లగడపాటి
తమ దగ్గర బ్రహ్మాస్త్రాలు చాలా ఉన్నాయని, విభజన ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదని కాంగ్రెస్ ఎంపి లగడపాటి రాజగోపాల్ మరోసారి నొక్కి చెప్పారు. అవసరం వచ్చినప్పుడు చివరి బ్రహ్మాస్త్రాన్ని వాడతామన్నారు. ముఖ్యమంత్రితో కలసి రాష్ట్రపతిని కలిసి, విభజించవద్దని కోరతామని తెలిపారు. అసెంబ్లీ తిరస్కరించిన బిల్లు పార్లమెంటులో చర్చకు రాదని ఆయన అభిప్రాయపడ్డారు.
అస్త్రాలు లేవు: గండ్ర
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్ దగ్గర ఎలాంటి అస్త్రాలు లేవని, రాష్ట్ర విభజన తథ్యమని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి దీక్ష చేసినా, లగడపాటి వేషాలు వేసినా విభజన ఆగదన్నారు.
టి బిల్లు అడ్డుకుంటాం: రాయపాటి
సమైక్యత కోసం సీమాంధ్రకు చెందిన నేతలమంతా ఏకతాటి పైకి వస్తామని గుంటూరు ఎంపి రాయపాటి సాంబశివ రావు అన్నారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో తాము రాష్ట్రపతిని కలుస్తామన్నారు. రాష్ట్రపతి తెలంగాణ బిల్లును పార్లమెంటుకు పంపించవద్దని కోరారు. ఒకవేళ బిల్లు పార్లమెంటుకు వస్తే అడ్డుకుంటామన్నారు.