కోడెలకు కోపం వచ్చింది: ప్లకార్డులు చేతబట్టి వెల్లోకి వైసీపీ సభ్యులు, 15 నిమిషాలు వాయిదా
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో భాగంగా రెండో రోజు సమావేశాళు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. దీంతో వైసీపీ ఎమ్మెల్యేలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళనకు దిగారు.
దీనిపై స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లకార్డులు చేతబట్టి సభలోకి రావడం పద్దతి కాదని ఆయన వ్యాఖ్యానించారు. అయినా వినని విపక్ష సభ్యులు స్పీకర్ పోడియం చుట్టుముట్టి వెల్లోకి దూసుకెళ్లారు. ఇదే సమయంలో ప్రశ్నోత్తరాలను అడ్డుకోవడం సరికాదని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు అన్నారు.
వైసీపీ సభ్యుల తీరును ప్రజలు గమనిస్తున్నారని, గొడవ చేస్తున్న వారి పట్ల స్పీకర్ చర్య తీసుకోవాలని విష్ణుకుమార్రాజు విజ్ఞప్తి చేశారు. సభాసమయం వృధా అవుతోందంటూ బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ వైఖరిని తప్పుబట్టారు. పిల్ల కాంగ్రెస్, తల్లి కాంగ్రెస్ రెండూ ఒకటేనని ఆయన ఆరోపించారు.

దీనిపై క్వశ్చన్ అవర్ రద్దు కావాలన్నది తమ ఉద్ధేశం కాదని ప్రత్యేక హోదాపై స్పష్టతను కోరుతున్నామని వైసీపీ సభ్యుడు శ్రీకాంత్రెడ్డి వివరణ ఇచ్చారు. చివరగా స్పీకర్ కోడెల మాట్లాడుతూ తన బాధ్యతలు గుర్తు చేయాల్సిన అవసరం లేదన్నారు.
ప్రభుత్వం ఏం చేయాలో విపక్ష సభ్యులు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. అవకాశం వచ్చినప్పుడు మాట్లాడాలని ప్రతిపక్ష సభ్యులకు సూచించారు. సోమవారం ప్రశ్నోత్తరాలు జరగనందుకు చాలా మంది బాధ పడ్డారని అన్నారు. అధికార, విపక్షాల పట్ల తనకు సమాన బాధ్యత ఉందన్నారు. తాను అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించాల్సిన అవసరం లేదన్నారు.
ఎంతకీ విపక్షాలు స్పీకర్ మాట వినకపోవడంతో స్పీకర్ పదిహేను నిమిషాల పాటు సభను వాయిదా వేశారు. రెండో రోజు శాసనసభా సమావేశాలు ప్రారంభమైన వెంటనే ప్రభుత్వం కరవు పరిస్థితిపై చర్చకు 344 నిబంధన కింద తెదేపా సభాపతికి నోటీసు అందజేసింది.












Click it and Unblock the Notifications