బాధగా ఉంది: కోడెల, మనసులో పెట్టుకోకండి: బాబు, 'జగన్ విత్ డ్రా అంటే..'
హైదరాబాద్: తన పైన అవిశ్వాస తీర్మానం వీగిపోయిన అనంతరం స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు మంగళవారం నాడు మాట్లాడారు. తన పైన అవిశ్వాస తీర్మానం పెట్టడం కొంత బాధగా ఉందని, అయితే సభాపతిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తానని కోడెల వ్యాఖ్యానించారు.
పక్షపాతి అని ముంద్ర వేశారని, అందుకే ఎక్కువ సమయం తీసుకోకుండా అవిశ్వాసానికి ఓకే చెప్పానని తెలిపారు. నాలుగు రోజులు ఆగితే అవిశ్వాసం విత్ డ్రా చేసుకునే ఆలోచన చేస్తామని చెప్పారని, కానీ అవిశ్వాసం పెట్టే ముందే అలాంటి ఆలోచన చేయాలన్నారు.
ప్రతిపాదన వచ్చాక విత్ డ్రా చేసుకుంటాననే ఆలోచన తనకు బాగా అనిపించలేదని చెప్పారు. అందుకే ఓటింగ్ కోసం సిద్ధపడ్డానని తెలిపారు. సభాపతిగా తన బాధ్యతలను నిష్పక్షపాతంగా నిర్వహిస్తున్నానని చెప్పారు. స్పీకర్ స్థానం తనకు అనుకోని అవకాశమన్నారు.
ఈ సందర్భంగా స్పీకర్.. తన ట్రాక్ రికార్డు చెప్పాల్సి ఉందని వ్యాఖ్యానించారు. తనదు ఒడిదుడుగుల జీవితం అన్నారు. కష్టపడి ఈ స్థాయికి వచ్చానని చెప్పారు. సభలో నిష్పక్షపాతంగా పని చేసేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పారు.
ఇదీ నా ట్రాక్ రికార్డ్..
ఓ గ్రామంలో మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాను. నేను చాలా కష్టాలు చూశాను. అమ్మానాన్న పొలం పనులు చేసేవారు. మా ఊళ్లో రోడ్లు ఉండకుండేవి. తాగడానికి నీళ్లు లేకుండా, బస్సు లేకుండా, రోడ్లు లేకుండా ఉన్న గ్రామం నుంచి వచ్చానని చెప్పారు.
అందుకే తనకు అవకాశం వస్తే గ్రామాభివృద్ధి పైన దృష్టి సారించానని చెప్పారు. గ్రామాల్లో వైద్యం కూడా సరిగా లేకుండెనన్నారు. రోగాలు వస్తే కషాయం తాగించేవారన్నారు. ఇలాంటి సమయంలో తాను డాక్టర్ కావాలని నిర్ణయించుకున్నానని చెప్పారు.
గ్రామాల్లోకి ఎవరైనా వ్యాక్సినేషన్ వేసేందుకు వస్తే పొలాల్లో దాక్కునే వారమన్నారు. నొప్పి లేస్తుందని అలా చేసేవాళ్లమన్నారు. ఇప్పటికీ ఆ దృశ్యాలు తన కళ్లముందు కనిపిస్తున్నాయ్నారు. దీంతో తాను డాక్టర్ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నానని చెప్పారు.
నేను కష్టపడి పైకి వచ్చానని చెప్పారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు తనలాంటి వారిని పిలిచారన్నారు. ప్రారంభంలో రాజకీయ ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని చెప్పారు. మొదటిసారి రాజకీయాల్లోకి రావడం, అక్కడ పాతవారు పాతుకుపోవడం వంటి కారణాలతో తన పైన కేసులు పెట్టారని చెప్పారు.
తన ఇంట్లో బాంబు పేలిన విషయం వాస్తవమేనని, దానితో తనకు సంబంధం లేదన్నది కూడా వాస్తవమేనని కోడెల శివప్రసాద్ చెప్పారు. శాసనసభ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తనపై నాలుగుసార్లు బాంబు దాడి జరిగిందన్నారు. ఫ్యూడల్ వ్యవస్థపై పోరాటంలో భాగంగా నలుగురు కుటుంబసభ్యులను పోగొట్టుకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.
మనసులో పెట్టుకోకండి: చంద్రబాబు
తాను ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మైక్ దొరకాలంటే పోరాడవలసి వచ్చేదని, ఇప్పుడు స్పీకర్ కోడెల మాత్రం ప్రతిపక్ష నేతకు అవకాశమిస్తున్నాడని సీఎం చంద్రబాబు అన్నారు. తమకు 25 గంటల సమయం ఇస్తే, ప్రతిపక్ష నేతకు 20 గంటల సమయం ఇచ్చారన్నారు.
నియోజకవర్గ సమస్యను కూడా స్పీకర్ వద్దకు తీసుకు రావడం బాధాకరమన్నారు. స్పీకర్గా మీరు నిర్మోహమాటంగా, నిష్పక్షపాతంగా పని చేసి ధర్మాన్ని, న్యాయాన్ని కాపాడే ప్రయత్నం చేయాలని చెప్పారు. ఈ రోజు జరిగిన సంఘటనను మనసులో పెట్టుకొని బాధపడవద్దన్నారు.
స్పీకర్ స్థానంలో ఉన్నారు కాబట్టి ఇలాంటి సమస్యలు వస్తాయన్నారు. మీరు మాత్రం దానిని వదిలేసి హుందాగా పని చేయాలని కోరారు. భగవంతుడు కూడా మీకు అన్ని విధాలా సహకరిస్తారని చెప్పారు. మీకు సభా నాయకుడిగా అన్ని విధాలా సహకరిస్తామన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్.. బసవతారకం ఆసుపత్రి పెడితే దానిలో స్పీకర్ కోడెల కీలక పాత్ర పోషించారన్నారు.