‘జగన్! ఓ కాలకేయుడు, అమృతంలో విషం చుక్క’
అమరావతి/నంద్యాల: టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబును నడిరోడ్డుపై కాల్చి చంపినా పాపం లేదన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రులు, టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూనే ఉన్నారు.
మంగళవారం రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసులు, న్యాయ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర, టీడీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ తీవ్ర విమర్శలు చేశారు.
జగన్ ఓ కాలకేయుడని మంత్రి కొల్లు రవీంద్ర ఓ ప్రకటనలో ధ్వజమెత్తారు. భూమా నాగిరెడ్డి మరణంతో ఖాళీ అయిన నంద్యాల స్థానంలో జగన్ పోటీ పెట్టి అనైతికతను చాటుకున్నారని, రాజకీయ విలువలు పాటించే ఏ పార్టీ కూడా పోటీకి దింపదని అన్నారు.

తండ్రి వయస్సు ఉన్న సీఎంను కాల్చిపారేయాలనడం దుర్మార్గమని, జగన్పై హత్యానేరం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. జగన్ చెంచాలు నోరు హద్దులో పెట్టుకుంటే మంచిదన్నారు. ఇది ఇలా ఉండగా, ప్రజాస్వామ్యమనే అమృతంలో జగన్ విషపు చుక్కలా మారాడని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు.
నంద్యాలలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిని కాల్చి చంపాలన్న వ్యక్తి మన రాష్ట్రానికి అవసరమా? అని ప్రజలు ఆలోచిస్తున్నారని తెలిపారు. సీఎంకు బహిరంగ క్షమాపణ చెప్పిన తర్వాతే నంద్యాలలో జగన్ అడుగు పెట్టాలని డొక్కా మాణిక్య వరప్రసాద్ డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications