చంద్రబాబు పర్యటనలో జేబు దొంగ చేతివాటం: మాజీ మంత్రి పర్సు మాయం
అమరావతి: ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినే చంద్రబాబు నాయుడు, ఇతర పార్టీ నేలతో కలిసి ముంపు ప్రాంతాలలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. వరద బాధిత ప్రజలను పరామర్శిస్తూ.. వారికి అండగా ఉంటామని చెబుతున్నారు. ప్రభుత్వం నష్ట పరిహారం అందించేలా పోరాటం చేస్తామని చెబుతున్నారు.
అయితే, ఈ పర్యటనలో ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా పర్యటనలో ఓ జేబు దొంగ తన చేతివాటం చూపించాడు. ఏకంగా మాజీ మంత్రి పర్సునే మాయం చేశాడు. చంద్రబాబు వెంట ఉన్న మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు జేబులోంచి ఓ దొంగ పర్సును కొట్టేశాడు.
అయితే, ఆ పర్సులో రూ. 35 వేల నగదుతోపాటు 2 ఏటీఎం కార్డులు కూడా ఉన్నాయట. అంతేగాక, 17000 విలువ చేసే విదేశీ కరెన్స్ కూడా పోయినట్లు తెలిసింది. ఈ క్రమంలో గొల్లపల్లి సూర్యారావు రాజోలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కాగా, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలను చంద్రబాబు సహా టీడీపీ నేతలు పరామర్శిస్తున్న విషయం తెలిసిందే. బాధిత ప్రజలను కలిసి వారికి అండగా ఉంటామని చంద్రబాబు భరోసా ఇస్తున్నారు. ప్రభుత్వం వెంటనే బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు చంద్రబాబు. ఇంతకుముందు టీడీపీ నేతల పర్యటనలో పడవ బోల్తా పడటంతో పలువురు నేతలు నీటిలో పడిపోయిన విషయం తెలిసిందే. అయితే, ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.