అమలాపురం పోస్టల్ డివిజన్ పరిధిలో రూ. కోటి గోల్ మాల్: అధికారుల ఐడీ, పాస్వర్డ్ లతోనే!
కోనసీమ: జిల్లాలోని అమలాపురం పోస్టల్ డివిజన్ పరిధిలోని పోస్ట్ పేమెంట్ బ్యాంక్లో కోటి రూపాయలకుపైగా నిధులు గోల్మాల్ అయినట్లు ఆరోపణలున్నాయి. పోస్టల్ ఉద్యోగి ఒకరు పోస్టల్ అధికారుల ఐడీ పాస్వర్డ్లతో తన బ్యాంక్ అకౌంట్లకు నిధులు మళ్లించినట్లు అధికారుల దర్యాప్తులో తేలింది.
అయినవిల్లి మండలం విలస పోస్టాఫీస్లో ఒక్క రోజులోనే 40 లక్షల రూపాయల లావాదేవీలు జరిగినట్లు తేలింది. విలస పోస్ట్ మాస్టర్ ఐడీ పాస్వర్డ్, పోస్టల్ ఉన్నతాధికారుల ఐడీ పాస్వర్డ్లు ఉపయోగించి నిధులు డిపాజిట్ చెయ్యడం, తమ బ్యాంక్ ఖాతాలకు జమ చెయ్యడం వంటి లావాదేవీలు నిర్వహించారు.

వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి అమలాపురం పోస్టల్ సూపరింటెండెంట్ బాల సత్యనారాయణ ఐడీ పాస్వర్డ్ ఉపయోగించి 40 లక్షల రూపాయల లావాదేవీలు ఒక్క రోజులో చేసినట్లు బయటపడింది. నగదు బదిలీలు జరిగిన ముమ్మిడివరం, రామచంద్రాపురం బ్యాంక్లలో కూడా పోస్టల్ ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నారు.
అమలాపురం పోస్టల్ సూపరింటెండెంట్ కార్యాలయంలోని ఒక ఉద్యోగి పై ఆరోపణలు వినిపిస్తున్నాయి. విలస పోస్ట్ ఆఫీసుకు పర్యవేక్షణ అధికారిగా కొత్తపేటలో సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్ ఉన్నారు. ఇతని పర్యవేక్షణ లోపమా? అనేది కూడా విచారణ జరుగుతోంది.
ఒక్క వ్యక్తి వల్ల ఇంత మొత్తం కాజేయటం కుదరని పని అని, ఇందులో మరికొంతమంది ఉన్నతాధికారుల పాత్ర ఉందంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ వ్యవహారం ఈ ఒక్క విలస పోస్ట్ ఆఫీస్ లోనే జరిగిందా...? ఇంకా డివిజన్లోని ఇతర పోస్ట్ ఆఫీస్లలో కూడా జరిగాయా? అనేది విచారణలో తేలాల్సి ఉంది. దీనిపై పోస్టల్ సూపరింటెండెంట్ బాల సత్యనారాయణను వివరణ కోరగా నిధుల మళ్లింపుపై పోస్టల్ ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నారని తెలిపారు. అధికారుల ఐడీ పాస్వర్డ్లు ఎవరు వినియోగించారనే దానిపై దర్యాప్తు జరుగుతోందన్నారు.
ఖాతాదారుల అకౌంట్లలోని డబ్బు భద్రంగా ఉందని... పోస్టల్ బ్యాంక్ సొమ్ముతో లావాదేవీలు జరిగాయని ఆయన తెలిపారు. అమలాపురం పోస్టల్ సూపరింటెండెంట్ పనితీరు బాగోలేదని ఇటీవల అమలాపురం ఎంపీ చింతా అనూరాధ పోస్టల్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications