కారు ప్రమాదం: బయటపడ్డ ఎంపీలు గీత, బుట్టా
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులు కొత్తపల్లి గీత, బుట్టా రేణుక బుధవారం రాత్రి కారు ప్రమాదానికి గురయ్యారు. ఇద్దరు ఎంపీలు పార్లమెంటు సమావేశం ముగిసిన అనంతరం వారు విడిదిచేసిన అశోకా హోటల్కు చేరుకుంటున్న సమయంలో పక్క సందులో నుండి ఒక ట్యాక్సీ వేగంగా వచ్చి వారి కారును ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఇద్దరు ఎంపీలు సురక్షితం బైటపడినా బుట్టా రేణుకకు చెందిన ఆడీ ఎస్యువి కారు బాగా దెబ్బతింది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని మధ్యప్రదేశ్కు చెందిన ట్యాక్సీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.
వైయస్సార్ కాంగ్రెస్ అధినాయకత్వంతో తగాదాపడిన ఇద్దరు ఎంపీలు ప్రయాణిస్తున్న కారును ట్యాక్సీ ఢీకొట్టటం యాదృచ్చికంగా జరిగిందా లేక ఏదైనా దురుద్దేశంతో కూడుకున్నదా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాము అశోకా హోటల్కు చేరుకుంటున్న సమయంలో సందులో నుంచి ఓ ట్యాక్సీ అమితవేగంగా దూసుకొవచ్చి తాను కూర్చున్న వైపు ఢీకొట్టిందని గీత మీడియాకు తెలిపారు. ఆడీ కారు కాకుండా మరో కారైతే తాము బతికేవాళ్లము కాదని గీత చెప్పారు. పోలీసు దర్యాప్తులో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని ఆమె అన్నారు.