దేవినేని ఉమను దిగ్బంధిస్తున్న ఎంపీ కేశినేని?
తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మైలవరం నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ చేతిలో ఓటమిపాలయ్యారు. వచ్చే ఎన్నికల్లో నూజివీడు నుంచి పోటీచేయమని అధిష్టానం ఆదేశించినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే దీన్ని ఉమ ఔననడంలేదు.. కాదనడంలేదు.
వసంతపై విమర్శలకు ఫుల్ స్టాప్?
అయితే దేవినేని కూడా మైలవరంలో సంవత్సర కాలం నుంచి ఎటువంటి కార్యక్రమాలు చేపట్టడంలేదు. ఏడాది ముందు వరకు ఎమ్మెల్యే వసంతపై తీవ్రస్థాయిలో నిప్పులు కురిపించిన మాజీ మంత్రి ఇప్పుడు సైలెంటయ్యారు. ఇదే క్రమంలో తనను ఇబ్బంది పెడుతున్న ఉమకు ప్రత్యర్థి అయిన వసంత కృష్ణప్రసాద్ ను కేశినేని అభినందిస్తున్నారు.. ఎంపీ నిధులిచ్చి ప్రోత్సహిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ కేశినేని నానికి పోటీగా అతని సోదరుడు చిన్నిని బరిలోకి దింపాలని కేశినేనికి వ్యతిరేక వర్గంగా ఉండే నాయకులు ప్రయత్నాలు ప్రారంభించారు. మాజీ మంత్రి దేవినేని ఉమ, బొండా ఉమ, బుద్ధా వెంకన్న తదితర జిల్లా నేతలకు, కేశినేనికి మధ్య సఖ్యత లేదు. ఇటీవల కాలంలో ఎంపీ కూడా పార్టీ అధినేత పట్ల దుడుకు వైఖరిని ప్రదర్శించడం, బొకే ఇవ్వమంటే నిరాకరించడంలాంటివన్నీ జరిగాయి. ఈ పరిణామాలన్నీ రానున్న ఎన్నికల్లో కేశినేనికి సీటు ఇవ్వడం కష్టమంటూ వార్తలు వస్తున్నాయి.
ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తున్న వసంత?
వసంత కృష్ణప్రసాద్ ఇటీవలే ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా రెండు సందర్భాల్లో కామెంట్లు చేశారు. దీంతో వసంత టీడీపీలోకి వస్తారంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా ఎంపీ కేశినేని మాట్లాడుతూ వసంత కృష్ణప్రసాద్ మంచి మనిషి అని, తాను ఎంపీ నిధులను ఇచ్చానని, వాటిని చక్కగా ఉపయోగించారంటూ కొనియాడారు. అంతేకాకుండా చక్కని రాజకీయ నాయకుడంటూ పొగడ్తలతో ముంచెత్తారు. వసంత టీడీపీలోకి వస్తే మైలవరం నుంచి టికెట్ అడుగుతారు. తనకు ప్రత్యర్థిగా ఉన్న దేవినేని ఉమకు చెక్ పెట్టవచ్చని కేశినేని భావిస్తున్నారు. అందుకే ఆయన వసంతను ప్రోత్సహిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
దేవినేని సానుకూలంగా ఉన్నారా? లేదా?
నూజివీడు నుంచి పోటీచేయడానికి ఉమ సానుకూలంగా ఉన్నారా? లేదా? అనే విషయంలో స్పష్టత రాలేదు. వసంత కృష్ణప్రసాద్ ను టీడీపీలోకి తీసుకువచ్చి మైలవరం టికెట్ ఇప్పించడంద్వారా ఉమను నిరోధించడం సులువవుతుందని ఎంపీ భావిస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ నేతల మధ్య సఖ్యత లేదు. ఈ విషయాన్ని చంద్రబాబు పదే పదే ప్రస్తావిస్తూ వారిని హెచ్చరిస్తున్నప్పటికీ వారిలో మార్పు వచ్చిన దాఖలాలు కనపడటంలేదు. చివరకు చంద్రబాబు వారిపై చర్యలు తీసుకుంటారా? లైట్ తీసుకుంటారా? అనేది ఎన్నికల సమయానికి కానీ స్పష్టత వచ్చేలా లేదు.