దినేష్ వ్యాఖ్యలు: కిరణ్ చరిత్ర తెల్సిందని కెటిఆర్
కిరణ్ అక్రమాస్తులపై సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కిరణ్ సీమాంధ్రకే ముఖ్యమంత్రి అని తాము మొదటి నుండి చెబుతున్నామని ఇప్పుడు దినేష్ రెడ్డి ఆరోపణలతో నిజమని తేలిందన్నారు. కిరణ్ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగేందుకు అనర్హుడన్నారు. ఆయనను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. భూకబ్జా వ్యవహారాలు బయటపెట్టినందుకు కిరణ్ మీడియా గొంతు నొక్కారని ఆరోపించారు.
కిరణ్ సీమాంధ్ర ఐక్యకార్యాచరణ సమితి కన్వీనర్ అని గతంలో తమ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు చెప్పారన్నారు. కిరణ్ ఆపద్దర్మ ముఖ్యమంత్రి మాత్రమే అన్నారు. దినేష్ రెడ్డికి ఇప్పటికైనా జ్ఞానోదయం కలిగినందుకు సంతోషమన్నారు. కిరణ్కు వత్తాసు పలుకుతున్న తెలంగాణ ప్రాంత మంత్రులు, కాంగ్రెసు నాయకులు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు. కిరణ్ నాటకాలు రానున్న తెలంగాణ ప్రభుత్వం బయటపెడుతుందన్నారు.
ముఖ్యమంత్రి ఆడుతున్న నాటకంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు భాగస్వాములు కావొద్దన్నారు. దినేష్ రెడ్డి వాస్తవాలు బయటపెట్టడంతో కిరణ్ చరిత్ర ఏమిటో తెలిసిపోయిందన్నారు. తెలంగాణ ఉద్యమంపై సిఎం కార్యాలయం కుట్రలకు కేంద్రంగా మారిందని ఆరోపించారు. ఎపిఎన్జీవోల సభ అనుమతిపై కిరణ్ ఒత్తిడి తెచ్చారనేది బహిర్గతమైందన్నారు. కిరణ్ ప్రోద్బలంతోనే సీమాంధ్రలో ఉద్యమం జరుగుతోందని స్పష్టమైందని విమర్శించారు.