బోడిగుండుకు మోకాలికి లంకె: లగడపాటిపై కెటిఆర్
హైదరాబాద్: కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్పై తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు కె తారక రామారావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. లగడపాటి మాటలు బోడిగుండుకు మోకాలికి లంకె పెట్టే విధంగా ఉంటాయని ఎద్దేవా చేశారు. లగడపాటిని అడిగితే ఆకాశంలో నక్షత్రాల ప్రభావం, సముద్రంలో అలల ప్రభావం కూడా రాష్ట్ర విభజనపై ఉంటుందని చెబుతారని కెటిఆర్ విమర్శించారు. లగడపాటి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.
ఎన్నికలు జరిగిన నాలుగు రాష్ట్రాల ఫలితాలు ఊహించినవేనని, లగడపాటి శోధించి సాధించిందేమి లేదని అన్నారు. కేంద్రం శీతాకాల పార్లమెంటు సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పెట్టి ఆమోదించాలని కెటిఆర్ డిమాండ్ చేశారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ బంద్ విజయవంతమైందని చెప్పారు. బంద్కు సహకరించి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని చాటిన ప్రజలందరికీ ఆయన ఈ సందర్భంగా ధన్యావాదాలు తెలిపారు.
తెలంగాణలో వ్యక్తమవుతున్న నిరసనలను చూసైనా కేంద్రం 12 జిల్లాల తెలంగాణ ప్రతిపాదనను విరమించుకోవాలని అన్నారు. 12 జిల్లాల తెలంగాణ ప్రతిపాదన అంటే కాంగ్రెస్ తన చావు తానే కొని తెచ్చుకోవడమని కెటిఆర్ హెచ్చరించారు. తెలంగాణలోని ప్రజలందరూ 10 జిల్లాల తెలంగాణను మాత్రమే కోరుకుంటున్నారని తెలిపారు. కేంద్రం పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఇస్తే సంతోషమని, లేదంటే కాంగ్రెస్ ఏ రాజకీయ ప్రయోజనం కోసం తెలంగాణను ప్రకటించిందో అది లభించదని అన్నారు.
రెండు జిల్లాల గురించి కాంగ్రెస్ ఆలోచిస్తే పది జిల్లాలో పరాజయం తప్పదని కెటిఆర్ చెప్పారు. రాయల తెలంగాణ తలాతోక లేని మూర్ఖపు ప్రతిపాదన అని అన్నారు. పెట్టుబడిదారులు చెప్పిన మాటలు వింటే ఇబ్బందులు తప్పవని ఆయన హెచ్చరించారు. శాసనసభ డిసెంబర్ 12 నుంచి ప్రారంభమవుతాయని, రాయల ప్రతిపాదన విరమించుకోనట్లయితే శాసనసభనే వేదికగా చేసుకొని యుద్ధానికి దిగుతామని తెలిపారు.
తెలంగాణ ప్రజలు 10 జిల్లాల తెలంగాణను కోరుకుంటున్నారని, వారి నిర్ణయమే తమకు శిరోధార్యమని పేర్కొన్నారు. తనది కానిదేది తెలంగాణ కోరుకోదని, అలాగే తనదైనదేది విడిచిపెట్టదని తారక రామారావు తేల్చి చెప్పారు. 10 జిల్లాలతో కూడిన తెలంగాణ వచ్చే వరకు తమ పోరాటం ఆగదని ఆయన తెలిపారు.