చంద్రబాబు ఇలాకాలోకి సీఎం జగన్ - తాజా సర్వేలో తేలిందేంటి..!!
సీఎం జగన్ ప్రతిపక్ష నేత చంద్రబాబును వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా దెబ్బ తీయాలనే పట్టుదలతో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు ఎందుకు గెలవలేమంటూ ధీమా వ్యక్తం చేస్తున్న సీఎం..ఇప్పుడు తన తొలి టార్గెట్ కుప్పం పైన ఫిక్స్ చేసారు. అందులో భాగంగా.. నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు నుంచి సమీక్షలు ప్రారంభం కానున్నాయి. ముందుగా కుప్పం నియోజకవర్గం నుంచి ఈ సమీక్షలు మొదలు పెట్టి.. సీఎం జగన్ తన అసలు లక్ష్యం ఏంటో స్పష్టం చేసారు. ఇక, ఈ సమీక్షకు కుప్పం నియోజకవర్గం నుంచి 60 మంది కార్యకర్తలు హాజరు కానున్నారు.
Recommended Video


చంద్రబాబుకు కంచుకోటపై ఫోకస్
నెలకు పది నుంచి 15 నియోజకవర్గాల కార్యకర్తలతో సీఎం సమావేశం కానున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో నిర్వహిస్తున్న గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన అభ్యర్ధనలు..సమస్యల గురించి ఇందులో చర్చించనున్నారు. కుప్పం టీడీపీ అధినేత చంద్రబాబు కంచుకోట. ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే, కొద్ది నెలల క్రితం జరిగిన స్థానిక- మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఏకపక్షంగా విజయం సాధించింది. అదే సమయంలో కుప్పంలో రాజకీయ పరిస్థితులు..ప్రజాభిప్రాయం పైన నాలుగు సంస్థలతో ముఖ్యమంత్రి జగన్ సర్వే చేయించినట్లు విశ్వసనీయ సమాచారం. ఆ నివేదికల్లోని సమాచారాన్ని క్రోడీకరించిన వైసీపీ నేతలు కుప్పంలో టీడీపీ - వైసీపీ మధ్య స్వల్ప తేడానే ఉన్నట్లుగా చెబుతున్నారు.

తొలి సమావేశం కుప్పం నుంచే
తాజాగా కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో కుప్పంను రెవిన్యూ డివిజన్ గా మార్చాలంటూ చంద్రబాబు ప్రభుత్వానికి లేఖ రాసారు. ఈ మేరకు సీఎం జగన్ సానుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. కుప్పంను రెవిన్యూ డివిజన్ గా ప్రకటించారు. అదే సమయంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పంలో రాజకీయంగా ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్సీ భరత్ వైసీపీ నుంచి పోటీ చేస్తారని ఆయన ఇప్పటికే వెల్లడించారు. ఈ అంశం పైనా నేటి సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. అదే విధంగా కుప్పంలో మండలాల వారీగా టీడీపీ - వైసీపీ బలాలు - బలహీనతల పైనా పూర్తి స్థాయిలో నివేదికలు సిద్దమైనట్లు తెలుస్తోంది. వీటన్నింటినీ కార్యకర్తలతో షేర్ చేసుకొనే అవకాశం కనిపిస్తోంది.

సీఎం జగన్ దిశా నిర్దేశం
ఎలాగైనా కుప్పంలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ జెంగా ఎగరాలనేది సీఎం జగన్ ఆకాంక్ష. అందు కోసం కుప్పం కార్యకర్తలకు స్పష్టమైన మార్గ నిర్దేశనం చేయనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత సీఎం జగన్ ఇప్పటి వరకు కుప్పం నియోజకవర్గంలో పర్యటించలేదు. వచ్చే నెలలో ఆయన కుప్పంలో పర్యటించటం..అక్కడ కొత్తగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించేలా ప్రణాళికలు సిద్దం అవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే చంద్రబాబు ప్రతీ మూడు నెలలకోసారి కుప్పంలో పర్యటిస్తున్నారు. కుప్పం నియోజకవర్గంలో ఇంటి నిర్మాణం చేస్తున్నారు. ఈ క్రమంలో.. మరింతగా కుప్పం పైన తాము ఫోకస్ చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. దీంతో.. ఈ రోజు జరిగే కార్యకర్తల సమీక్షలో సీఎం జగన్ కుప్పం పైన ఎటువంటి కార్యాచరణ ప్రకటిస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications