IND vs SL: కొంపముంచిన విప్రజ్ నిగమ్.. 10 పరుగులు బొక్కా!
దంబుల్లా వేదికగా ఇండియా-ఏ, శ్రీలంక-ఏ జట్ల మధ్య జరిగిన ముక్కోణపు సిరీస్ క్రికెట్ మ్యాచ్లో ఓ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. మైదానంలో సాధారణంగా కనిపించని ఈ దృశ్యం క్రీడాభిమానులతో పాటు కామెంటేటర్లను కూడా ఆశ్చర్యపరిచింది. మైదానంలో టీమిండియా యువ ఆటగాడు విప్రజ్ నిగమ్ చేసిన పొరపాటు టీమిండియాను కోలుకోలేని దెబ్బ తీసింది. నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను పిచ్ నిర్వాహకులు, అంపైర్లు శ్రీలంక జట్టుకు ఏకంగా పది పెనాల్టీ పరుగులను అప్పగించారు.
ఈ టోర్నమెంట్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండియా-ఏ జట్టు ప్రారంభంలోనే కీలక వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో పడింది. స్టార్ బ్యాటర్లు తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరడంతో గౌరవప్రదమైన స్కోరు కోసం టీమిండియా పోరాడుతోంది. ఆ సమయంలో ఇన్నింగ్స్ నిలబెట్టడానికి క్రింది వరుస బ్యాటర్ అయిన విప్రజ్ నిగమ్ క్రీజులోకి వచ్చాడు. అయితే బ్యాటింగ్లో రాణించినప్పటికీ.. అతను చేసిన ఓ పెద్ద పొరపాటు కారణంగా మొత్తం మ్యాచ్ పరిణామాలే మారిపోయాయి. అంతకుముందే భారత బ్యాటర్ అనుకుల్ రాయ్కు అంపైర్లు అధికారిక హెచ్చరిక జారీ చేశారు.

పదే పదే తప్పిదాలు.. 10 పరుగులు నష్టం
ఐసీసీ నిబంధనల ప్రకారం ఒకసారి హెచ్చరిక జారీ చేసిన తర్వాత అదే జట్టుకు చెందిన ఏ బ్యాటర్ అయినా మళ్లీ పిచ్ ప్రొటెక్టెడ్ ఏరియాలోకి వస్తే పెనాల్టీ విధిస్తారు. అయితే క్రీజులోకి వచ్చిన విప్రజ్ నిగమ్ ఇన్నింగ్స్ 35వ ఓవర్లో మొదటిసారి నేరుగా పిచ్ మధ్యలో ప్రొటెక్టెడ్ ఏరియాపై ఉన్న పరుగులు తీశాడు. అంపైర్లు నిబంధనల ప్రకారం వెంటనే స్పందిస్తూ శ్రీలంక-ఏ జట్టుకు 5 పెనాల్టీ పరుగులను కేటాయించారు. ఇది ఇండియా-ఏ జట్టుకు ఊహించని పెద్ద షాక్ ఇచ్చింది.
ఈ మొదటి పొరపాటు జరిగిన కొద్దిసేపటికే విప్రజ్ నిగమ్ మళ్లీ అదే తప్పును పునరావృతం చేయడం గమనార్హం. ఈ మ్యాచ్ 37వ ఓవర్లో శ్రీలంక స్పిన్నర్ కుగాదాస్ మథులన్ వేసిన బంతిని థర్డ్ మ్యాన్ దిశగా నెట్టి సింగిల్ కోసం ప్రయత్నించాడు. ఈ క్రమంలో విప్రజ్ మళ్లీ పిచ్ మధ్య భాగంలోనే పరుగెత్తాడు. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉన్న సహచర ఆటగాడు సూర్యాంశ్ షెడ్జ్ గట్టిగా అరిచి వారించినప్పటికీ.. అప్పటికే విప్రజ్ నిగమ్ చాలా దూరం వెళ్ళిపోయాడు. అంపైర్లు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరోసారి 5 పరుగుల పెనాల్టీ విధించారు.
నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
క్రికెట్ పిచ్ మధ్య భాగాన్ని అత్యంత సున్నితమైన ప్రాంతంగా భావిస్తారు. బ్యాటర్లు ధరించే స్పైక్స్ ఉన్న బూట్ల వల్ల పిచ్ పాడవకుండా ఉండటానికి ఈ ప్రాంతంలో పరుగెత్తడానికి అనుమతించరు. అలా పరుగెత్తడం వల్ల పిచ్ స్వభావం మారిపోయి, బంతి బౌన్స్ కావడం లేదా స్పిన్ కావడంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అందుకే దీనిని ప్రొటెక్టెడ్ ఏరియాగా పిలుస్తారు. ఎంసీసీ నిబంధన 41.14 ప్రకారం.. మొదటి సారి ఎవరైనా తప్పు చేస్తే అంపైర్లు అధికారికంగా హెచ్చరిస్తారు. ఆ తర్వాత ఏ ఆటగాడు చేసినా ప్రత్యర్థి జట్టుకు పెనాల్టీ పరుగులను కేటాయిస్తారు.
ఈ రెండు తప్పిదాల వల్ల శ్రీలంక-ఏ జట్టు బ్యాటింగ్ ప్రారంభించకముందే వారి ఖాతాలో ఉచితంగా పది పరుగులు చేరిపోయాయి. ఈ విచిత్రమైన సంఘటన సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. యువ క్రికెటర్లలో ఒత్తిడి కారణంగా ఇలాంటి అనుభవలేమి లోపాలు బయటపడతాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనప్పటికీ, ఈ తీవ్రమైన నష్టం యువ ఆటగాడు విప్రజ్ నిగమ్తో పాటు భవిష్యత్తులో ఇతర ఆటగాళ్లకు కూడా ఒక మంచి గుణపాఠం అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.












Click it and Unblock the Notifications