ర్యాలీలు, రోడ్ షోలపై నిషేధం లేదు-చంద్రబాబు అడ్డుకోలేదా ? మాజీ మంత్రి కన్నబాబు కామెంట్స్..
కాకినాడ : ఏపీలో వైసీపీ ప్రభుత్వం కందుకూరు, గుంటూరు ఘటనల నేపథ్యంలో అమల్లోకి తెచ్చిన జీవో నంబర్ 1పై చర్చ జరుగుతోంది. విపక్షాలు దీనిపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో ఇవాళ మాజీ మంత్రి కురసాల కన్నబాబు దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఈ జీవోలో ఉన్నది ఒకటైతే, విపక్షాలు, మీడియా మరొకటి ప్రచారం చేస్తున్నాయని ఆయన విమర్శించారు.
ప్రజల భద్రత, రక్షణ కోసం ప్రభుత్వం జీఓ నెం:1 జారీ చేస్తే, దానిపై రాష్ట్రంలో పెద్ద చర్చ జరుగుతోందని మాజీ మంత్రి కన్నబాబు ఆరోపించారు. అది తనను అడ్డుకోవడానికే అని విపక్ష నేత చంద్రబాబు ఆరోపిస్తుండగా, ఆయనకు వత్తాసు పలుకుతున్న ఎల్లో మీడియా కూడా అదే ప్రచారం చేస్తోందన్నారు. ఆ విధంగా చంద్రబాబు, ఎల్లో మీడియా దుష్ప్రచారం చేయడం దురదృష్టకరమని కన్నబాబు తెలిపారు. ప్రజలను కాపాడడం ప్రభుత్వ కనీస బాధ్యతని, అందు కోసమే జీఓ జారీ చేస్తే, చంద్రబాబు తనను అణగదొక్కడానికే అని ప్రచారం చేస్తున్నారన్నారు. కాబట్టి ఆ జీఓలో ఏముంది అన్నది ఒక్కసారి చంద్రబాబు, ఎల్లో మీడియా చూడాలన్నారు. జీఓలో ఏముంది?. ఎక్కడా రోడ్ల మీద తిరగొద్దని, ర్యాలీలు నిర్వహించొద్దని, రోడ్షోలు వద్దని లేదన్నారు. కేవలం రహదారులు, వాటి పక్కల, మార్జిన్లలో బహిరంగ సభలు, సమావేశాలు నిషేధిస్తూ జీఓ జారీ చేశారన్నారు. అంతే కానీ ర్యాలీలు నిర్వహించొద్దని, పరిమితికి మించి ప్రజలు వెళ్లకూడదని, వాహనాలు వెళ్లకూడదని ఎక్కడా లేదే అని అన్నారు.

కానీ చంద్రబాబుతో పాటు, ఆయనకు మద్దతు ఇస్తున్న ఎల్లో మీడియా కూడా జీఓపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని కన్నబాబు మండిపడ్డారు. దాన్ని చీకటి జీఓ అని అభివర్ణిస్తున్నారన్నారు. కానీ చంద్రబాబు వైఖరి, ఆయన చేసిన పని వల్ల కందుకూరులో 8 మంది బలయ్యారని కన్నబాబు విమర్శించారు. ఆ తర్వాత గుంటూరులోనూ అదే జరిగిందన్నారు. ప్రజలను కాపాడడానికి, వారికి భద్రత కల్పించడం కోసమే జీఓ జారీ చేశారు తప్ప, ఎవరిపైనా కక్ష సాధింపు కాదన్నారు.
ఒకరేమో చీకటి జీఓ అంటున్నారు. మరొకరు బ్రిటిషర్లు తెచ్చిన పోలీస్ చట్టం అంటున్నారు. కానీ నిజం చెప్పాలంటే ఇవాళ దేశంలో అమలవుతున్న చట్టాలన్నీ పాతవేనని కన్నబాబు తెలిపారు. కొత్తగా రూపొందించినవి కావన్నారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు కూడా అవే చట్టాల ద్వారా ఆంక్షలు అమలు చేశారన్నారు. 2014-19 మధ్య తూర్పు గోదావరిలో ఇదే పోలీస్ చట్టంలోని సెక్షన్-30, 31ని చంద్రబాబు మూడేళ్లు నిర్బంధంగా అమలు చేశారన్నారు. అయినా ఇదే ఎల్లో మీడియా ఏనాడూ ప్రశ్నించలేదని, తప్పు పట్టలేదన్నారు. కానీ అదే చంద్రబాబు ఇవాళ జీఓ నెం:1ని తీవ్రంగా తప్పు పడుతున్నారన్నారు. ఆయన నిర్బంధం అంటూ మాట్లాడుతున్నాడని, ఆయనకు తానా అంటే తందానా అనే కొన్ని పార్టీల వారూ అదే విమర్శిస్తున్నారన్నారు.

చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఒక బలమైన కారణం కోసం ముద్రగడ పద్మనాభం దీక్ష చేస్తే, ఏ చట్టం ప్రకారం ఆయనను నియంత్రించారని ప్రశ్నించారు. ఆయనను పరామర్శించడానికి చిరంజీవి వస్తే, ఆయనను ఎందుకు అడ్డుకున్నారన్నారు. విశాఖలో జగన్ను ఎయిర్పోర్టులోనే ఎందుకు నిలువరించారన్నారు. అదే విధంగా అప్పటి ఎమ్మెల్యే, ఇవాళ్టి మంత్రి రోజాను జీపులో కుక్కి, ఎక్కడెక్కడో తిప్పి పంపించారన్నారు. కానీ అవేవీ ఇవాళ చంద్రబాబుకు వంత పాడుతున్న కొన్ని పార్టీలకు ఆనాడు కనిపించ లేదన్నారు. వారికి అవేవీ తప్పుగా అనిపించలేదన్నారు












Click it and Unblock the Notifications