విషాదం: సరదాగా బావిలో ఈతకు దిగి.. నలుగురు చిన్నారులు మృతి
కర్నూలు: జిల్లాలోని కృష్ణగిరి మండలం ఆలంకొండలో విషాద ఘటన చోటుచేసుకుంది. సరదాగా ఈతకు వెళ్లిన నలుగురు చిన్నారులు బావిలో పడి మృతి చెందారు. సాయికుమార్, కార్తీక్, రాజేశ్, కమాల్ బాషా ఆలంకొండకు చెందిన స్నేహితులు. గురువారం సాయంత్రం పూట సరదాగా నలుగురు కలిసి ఓ పొలం వద్దకు ఈతకు వెళ్లారు.
అక్కడే వ్యవసాయ బావిలో ఈత కొట్టడానికి దిగారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న విద్యుత్ మోటార్ వైర్లు తగిలి ప్రాణాలు కోల్పోయారు. నలుగురు చిన్నారుల మృతితో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మహిళా వాలంటీర్ను హత్య చేసిన నిందితుడు ఆత్మహత్య
బాపట్ల జిల్లా వేమూరు మండలం చావలిలో వాలంటీర్ శారద(27) హత్య కేసులో నిందితుడిగా ఉన్న పద్మారావు(35) ఆత్మహత్య చేసుకున్నాడు. పొన్నూరు పట్టణంలోని నిడుబ్రోలు రైల్వేస్టేషన్లో తిరుపతి నుంచి విశాఖ వెళ్తున్న డబుల్ డెక్కర్ రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. గురువారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
పద్మారావు జేబులో ఉన్న కార్డుల ఆధారంగా పోలీసులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న కుటుంబీకులు.. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి పద్మారావుగా గుర్తించారు. వాలంటీర్ హత్యకు సంబంధించి మనస్తాపంతోనే పద్మారావు ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మహిళా వాలంటీర్ శారదతో వివాహేతర సంబంధం కొనసాగించిన పద్మారావు.. ఇటీవల ఆమెను హత్య చేశాడు. ఆ తర్వాత ఇప్పుడు అతను కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు.