అలా చేస్తే.. బాబుకు సాష్టాంగ నమస్కారం చేస్తా: కేవీపీ ఆసక్తికరం
హైదరాబాద్: కాంగ్రెస్ రాజ్యసభసభ్యుడు కేవీపీ రామచంద్రరావు.. ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2018 నాటికి పోలవరం ప్రాజెక్టు కనుక పూర్తి చేస్తే చంద్రబాబుకు సాష్టాంగ నమస్కారం చేస్తానని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టు కాంట్రాక్టుల వెనుక ప్రభుత్వ స్వార్థ ప్రయోజనాలున్నాయని ఆరోపించారు.
కాంగ్రెస్ హయాంలో పోలవరం ప్రాజెక్టుపై టీడీపీ కోర్టుకు ఎందుకు వెళ్లిందో చెప్పాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ కేవీపీ రామచంద్రరావు ప్రశ్నించారు. ఒక న్యూస్ ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టుపై ఛత్తీస్ గఢ్ రాష్ట్రం కోర్టుకు వెళితే చంద్రబాబు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

పోలవరం గురించి ప్రశ్నిస్తే రాక్షసుల్లా అడ్డుపడి ప్రాజెక్టును అడ్డుకుంటున్నారని అధికారపక్ష నాయకులు అంటున్నారని విమర్శించారు. 'ఒక కృష్ణా జిల్లా వాసిగా, ఆరోజు పోలవరం ప్రాజెక్టుతో సంబంధమున్న ఒక వ్యక్తిగా నేను చెబుతున్నా. మా జిల్లాలో రైతాంగాన్ని రెచ్చగొట్టి, టీడీపీకి సంబంధించిన రైతులతో కోర్టులో పిటిషన్లు వేయించి.. స్టేలు తీసుకువచ్చింది చంద్రబాబునాయుడుగారు కాదా?' అంటూ కేవీపీ నిలదీశారు.
అయినా అన్ని కష్టాలను ఎదుర్కొని, ఆ ప్రాజెక్టును ఒక దారిలోకి తీసుకుని వస్తే, ఈరోజు గోదావరి జలాలను కృష్ణా నదిలో కలుపుకుంటున్నామంటున్నారని మండిపడ్డారు. 'పోలవరం ప్రాజెక్టు ఒకటి ఉంది, దాని గురించి మనం మాట్లాడాలి, సాధించాలి అనే ధ్యాస.. చంద్రబాబు నాయుడుకి కానీ, ఎన్డీఏ సర్కార్ కు గానీ లేవు' అని కేవీపీ ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications