ప్రైవేట్ మెంబర్ బిల్లుపై ఉత్కంఠ: ఏకగ్రీవం అంటూ అరుణ్ జైట్లీకి కేవీపీ లేఖ
న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేకహోదా కోరుతూ రాజ్యసభలో తాను ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుకు ఓటింగ్ లేకుండా ఏకగ్రీవంగా ఆమోదం పొందేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీకి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ కేవీపీ రామచంద్రరావు బుధవారం లేఖ రాశారు.
కేవీపీ ప్రైవేట్ బిల్లు: కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్, వైసీపీ ఎంపీలతో వెంకయ్య
రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లను ఏకగ్రీవంగా పాస్ చేయించాలని కోరుతూ ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. 2014లో బిల్లు ఆమోదం పొందుతున్న తరుణంలో రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న అరుణ్ జైట్లీకి కేవీపీ లేఖ రాయడం పెద్ద చర్చనీయాంశం అయింది.
బిల్లు పెట్టే సమయంలో వివిధ పార్టీల నేతలు ఇచ్చిన హామీలతో పాటు అప్పటి పరిస్థితులు, చేసిన వ్యాఖ్యలను ఆ లేఖలో ఆయన వివరించారు. ఇందుకు సంబంధించి సుమారు రెండొందల పేజీలతో కూడిన ఓ కాపీని కేవీపీ తన లేఖకు జత చేస్తూ అరుణ్ జైట్లీకి పంపించారు.
ఏపీ ప్రజల ప్రయోజనాలను కాపాడాలని, ఓటింగ్ లేకుండా ఏకగ్రీవంగా బిల్లు ఆమోదం పొందేలా చర్యలు తీసుకోవాలని ఆయన జైట్లీకి విజ్ఞప్తి చేశారు. ఈ బిల్లు ఏ ఒక్క వ్యక్తికో సంబంధించినది కాదని, ఎలాగైనా బిల్లు ఆమోదం పొందేలా చూడాలని ఆయన కోరారు.
జులై 22 ఏపీకి ఎంతో కీలకం: కేవీపీ బిల్లుపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ
ఇది రాజకీయాలు చేసే సమయం కాదని, ఏపీ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకునే సమయమని ఆయన చెప్పారు. ఈ బిల్లును పాస్ చేసుకునేందుకు ఐపికి చెందిన ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని బుధవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యానించారు.
పార్టీల మధ్య ఉన్న విభేదాలను పక్కనపెట్టి కేంద్రంతో పోరాడాలని ఆయన సూచించారు. తాను ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లుకు అందరూ సహకరిస్తారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేకహోదా కోరుతూ రాజ్యసభలో కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లు ఈ నెల 22న చర్చకు రానున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాలకు పదను పెట్టింది.
రాజ్యసభలో బిల్లును ఎలాగైనా పాస్ చేయించుకోవాలని ఉద్దేశంతో వివిధ పార్టీలకు చెందిన నేతలను ఢిల్లీలో కలుస్తున్నారు. మరోవైపు కేవీపీ ప్రవేశ పెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లును ఏపీ బీజేపీ శాఖ అధ్యక్షుడు, ఎంపీ కంభపాటి హరిబాబు రాజ్యసభకు రానివ్వమని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ప్రైవేట్ మెంబర్ బిల్లుపై ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీకి కేవీపీ లేఖ రాయడం పెద్ద చర్చనీయాంశమైంది.