దత్తపుత్రుడు దొరికాడని ఇలా...: విభజనపై లగడపాటి
హైదరాబాద్: దత్తపుత్రుడు దొరికాడని తమ కాంగ్రెసు పార్టీ అధిష్టానం రాష్ట్ర విభజనపై ముందుకు సాగుతోందని కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజనపై ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో కాంగ్రెసు అధిష్టానంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దత్తపుత్రుడు దొరికాడని తమను అరువు పుత్రులుగా చూస్తోందని ఆయన పార్టీ అధిష్టానంపై మండిపడ్డారు. దత్తపుత్రుడి లాభం కోసం రెండు సార్లు పార్టీని గెలిపించిన ప్రజలకు అన్యాయం చేయడం సరి కాదని ఆయన అన్నారు.
విభజన ప్రక్రియపై అంతా అయిపోయిందని చెప్పి బేరసారాలకు దిగడం సరికాదని, తాము బేరసారాలకు లొంగబోమని ఆయన అన్నారు. రాయలసీమ, కోస్తాంధ్ర పార్లమెంటు సభ్యులు రాజీనామాలు చేస్తే విభజన ప్రక్రియ నెమ్మదిస్తుందని, తమతో 2014 మేరకు కేంద్ర ప్రభుత్వానికి అవసరం ఉందని ఆయన అన్నారు. విభజన ప్రక్రియ పూర్తి కాలేదని, అది పూర్తి కావడం అంత సులువు కాదని ఆయన అన్నారు. కర్ణుడికి కవచకుండలాలు ఉన్నట్లు సమైక్యాంధ్రకు 371డి రక్షణగా ఉందని ఆయన చెప్పారు. ఆర్టికల్ 371 గురించి శ్రీకృష్ణ కమిటీ నివేదికలో కూడా ఉందని, దాన్ని తొలగించకుండా విభజనకు ముందుకు వెళ్లడం సాధ్యం కాదని, అందుకు రాజ్యాంగసవరణ అవసరమని ఆయన అన్నారు.
371డిని కాదని విభజన విషయంలో కేంద్రం ముందుకు వెళ్తే కోర్టుకు వెళ్లడానికి అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. సీమాంధ్ర ఉద్యోగులు రెండున్నర కోట్ల రూపాయల మేర జీతాలు వదులుకుని సమ్మె చేస్తున్నారని, ప్రజలకు ఇబ్బంది కలగకూడదని వారు సమ్మె విరమించారని ఆయన చెప్పారు. సమ్మె విరమించుకోవాలని సీమాంధ్ర ఉద్యోగులకు తాము చెప్పినట్లు ఆయన తెలిపారు. తమ చేతుల్లో 371డి ఆయుధం ఉందని, దాన్ని ప్రయోగిస్తామని ఆయన చెప్పారు.
రాష్ట్ర విభజన విషయంలో అధిష్టానం మాటకు అనుగుణంగా వెళ్తే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని, అయితే దాని కోసం ఆశపడకుండా ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజల కోసం సమైక్యానికి కట్టుబడి ఉన్నారని ఆయన అన్నారు. రాష్ట్రం కోసం కేంద్రాన్ని, పార్టీ అధిష్టానాన్ని ముఖ్యమంత్రి వ్యతిరేకిస్తున్నారని ఆయన అన్నారు. పదవీత్యాగం చేయడానికి కూడా కిరణ్ కుమార్ రెడ్డి సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. బతికి ఉన్న వ్యక్తులకు సమాధి కట్టడం సరి కాదని, అది మన సంస్కృతి కాదని ఆయన అన్నారు. సోనియా గాంధీకి సమాధి కట్టడాన్ని ఆయన వ్యతిరేకించారు.