టీపై లగడపాటి, సబ్బం రాజీనామాలకు మొగ్గు
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్, సబ్బం హరి రాజీనామాలకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. పార్లమెంటు సభ్యులు పార్లమెంటులో రాజీనామాలు చేస్తారని వార్తలు వచ్చినప్పటికీ అందుకు ఎవరూ మొగ్గు చూపిన దాఖలాలు కనిపించడం లేదు. ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటామని నేరుగా రాష్ట్రపతికి చెబుతామని కూడా లగడపాటి అన్నారు.
కానీ మెజారిటీ పార్లమెంటు సభ్యులు రాజీనామాలు చేయడానికి సిద్ధంగా లేరని సమాచారం. చిరంజీవి, దగ్గుబాటి పురంధేశ్వరి వంటి కేంద్ర మంత్రులు మంత్రి పదవులకు రాజీనామాలు చేశారే తప్ప తమ పార్లమెంటు సభ్యత్వాలకు రాజీనామాలు చేయలేదు. కేంద్ర మంత్రి కావూరి సాంబశివ రావు రాజీనామా చేయడానికి ఏ మాత్రం సిద్ధంగా లేనట్లు చెబుతున్నారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని లగడపాటి రాజగోపాల్ కరుడుగట్టిన సమైక్యవాదిగా చూస్తున్నారు. సబ్బం హరి చాలా కాలంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్కు మద్దతుగా నిలిచారు. అయితే, సబ్బం హరితో తమ పార్టీకి ఏ విధమైన సంబంధం లేదని వైయస్సార్ కాంగ్రెసు ఆ మధ్య ప్రకటించింది. దీంతో ఆయన కాంగ్రెసుతోనే ఉండే అవకాశాలున్నాయి.
రాష్ట్ర విభజనను అడ్డుకుంటామని కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు కొంత మంది ఇప్పటికీ చెబుతున్నారు. అయితే, దాన్ని ఆపలేమనే అభిప్రాయమే ఎక్కువ మందిలో ఉన్నట్లు కనిపిస్తోంది. దీంతో విభజన ఖాయమైనప్పుడు సీమాంధ్రకు ప్రయోజనం చేకూర్చే విధంగా విభజన ప్రక్రియను మల్చాలని ఎక్కువ మంది ప్రయత్నాలు చేశారు. అతి కొద్ది మంది మాత్రమే ఇంకా విభజనను అడ్డుకుంటామని చెబుతున్నారు. ఏమైనా, సీమాంధ్ర కాంగ్రెసు పార్లమెంటు సభ్యుల్లో విభజనను అడ్డుకునే విషయంలో ఐక్యత లేనట్లు కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications