సీఎం జగన్ పై చంద్రబాబు మరో అస్త్రం : ఈ సారి నేరుగా..!!
టీడీపీ అధినేత చంద్రబాబు రూటు మార్చారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్న చంద్రబాబు కొత్త అస్త్రాలు ప్రయోగిస్తున్నారు. ఇప్పటికే తనకు ఇవే చివరి ఎన్నికలు అని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు కొత్త నినాదం సిద్దం చేసారు. సెంటిమెంట్ - ఎమోషన్ పండిస్తూ.. మొత్తంగా ప్రజలే ఆలోచించాలనే విధంగా ప్రచారం చేసేందుకు సిద్దమయ్యారు. "రాష్ట్రానికిదే చివరి ఛాన్స్" అనే నినాదం తెర మీదకు తెచ్చారు.ఈ మేరకు పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేసారు.

రాష్ట్రానికిదే చివరి ఛాన్స్ అనే నినాదంతో
ఇప్పటి వరకు వచ్చే ఎన్నికలు తనకు చివరివిగా చంద్రబాబు చెప్పారు. కానీ, ఇప్పుడు "రాష్ట్రానికిదే చివరి ఛాన్స్" అనే నినాదం తెర మీదకు తెచ్చారు. ఏపీకి చంద్రబాబు అవసరం ఉందా - చంద్రబాబు కు ఏపీ అసవరం ఉందా అనే ప్రశ్నించే విధంగా చంద్రబాబు అండ్ కో చర్చ ప్రారంభించింది. చంద్రబాబు సైతం ఈ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే రాష్ట్రాన్ని ఏ శక్తీ కాపాడలేదంటూ వ్యాఖ్యానించారు.
ఏ రాత్రి ఏ పోలీసోడు వస్తాడో, ఏ వైసీపీ రౌడీ వస్తాడో తెలియదంటూ కొత్త ప్రచారం ప్రారంభించారు. ఇప్పుడు బయటకు రాకుంటే మీ బిడ్డలకు అన్యాయం చేసినవారవుతారంటూ ఓటర్లలో ఆలోచన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా వ్యూహాత్మక మైండ్ గేమ్ గా ఉందనే విశ్లేషణలు మొదలయ్యాయి.

పిల్లల భవిష్యత్ కోసం టీడీపీ రావాలంటూ
వైసీపీ కబంధహస్తాల నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించాలంటే టీడీపీ గెలవాలని ప్రచారం చేయాలని నేతలకు సూచించారు. తమ పిల్లల భవిష్యత్తు జగన్ ప్రభుత్వంలో అగమ్యగోచరంగా మారినట్టు ప్రజలు భావిస్తున్నారని... అందుకే యువత బయటకు వస్తోందని చెప్పుకొచ్చారు. కర్నూలు పర్యటనలో భాగంగా చంద్రబాబు ఈ ఎన్నికల్లో తాను గెలవకపోతే, ఇవే తనకు చివరి ఎన్నికలని చెప్పటంతో రాజీకయంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది.
చంద్రబాబుకు చివరి ఎన్నికలే అంటూ వైసీపీ నేతలు కౌంటర్ ఎటాక్ చేసారు. ధైర్యంగా గెలుస్తామని చెప్పాల్సిన చంద్రబాబు.. ఇవే చివరి ఎన్నికలని చెప్పటం ఏంటంటూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఇక, తాను మొదలు ప్రతీ ఒక్కరూ ప్రజల్లోనే ఉండాలని చంద్రబాబు నిర్దేశించారు. ఏపీలో ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా తాము సిద్దమేనని స్పష్టం చేసారు.

వర్కవుట్ అయ్యేనా - అధికారం దక్కేనా
అయితే, చంద్రబాబు "రాష్ట్రానికిదే చివరి ఛాన్స్" అంటూ చేస్తున్న ప్రచారం పైన వైసీపీ స్పందన చూడాల్సి ఉంది. టీడీపీ అధికారంలోకి రాకపోతే..ఇక రాష్ట్రానికి భవిష్యత్ లేదనే అభిప్రాయం ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ఈ ప్రచారం ఎంచుకున్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ గెలవకపోతే 2029 నాటికి చంద్రబాబు వయసు మరింత మీద పడుతుంది.
మరో సారి వైసీపీ అధికారంలోకి వస్తూ టీడీపీ భవిష్యత్ ఇబ్బంది కరమేననే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్ ఈ కారణాలతోనే ఈ సారి అధికారంలోకి వస్తే 30 ఏళ్లు తామే అధికారంలో ఉంటామని ధీమాగా చెబుతున్నారు. మరి..ఇప్పుడు చంద్రబాబు టీడీపీ గెలుపు - ఏపీ ప్రజల భవిష్యత్ కు లింకు పెడుతూ చేస్తున్న ప్రచారం అధికారాన్ని దగ్గర చేస్తుందా లేదా అనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications