రాజమండ్రి సెంట్రల్ జైల్ లో తోపులాట?
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జ్యుడీషియల్ రిమాండ్ పై రాజమండ్రి జైలులో ఉన్నారు. ఆ జైలులో ఏ చిన్న సంఘటన జరిగినా ఉలిక్కిపడాల్సి వస్తోంది. జైలులో చంద్రబాబుకు భద్రత లేదని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాజమండ్రి జైలులో జరిగిన ఒక సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
గత నెల 25వ తేదీన ఖైదీలు భోజనానికి వెళ్లే క్రమంలో తలుపు తీయగా తోపులాట జరిగి విజయవాడ భవానీపురానికి చెందిన ఖైదీ ఆవల నవీన్ రెడ్డి గాయపడ్డారు. అతన్ని పోలీసులు కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందించారు. గత నెల 25వ తేదీన సంఘటన జరిగితే రెండువారాలపాటు జాప్యం ఎందుకు జరిగిందో అర్థం కావడంలేదు. నవీన్ సిమెంటు దిమ్మపై పడటంతో ఎడమ దవడ ఎముకకు తీవ్ర గాయమైంది. ఈ విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచారు.

ఖైదీలు భోజనానికి వస్తున్న సమయంలో నవీన్ రెడ్డి కంగారుగా వెళుతూ కాలుజారి పక్కనే ఉన్న మెట్టుపై పడటంతో గాయమైందని జైలు సూపరింటెండట్ రాహుల్ చెప్పారు. తర్వాతరోజు జైలు డాక్టర్ల సూచన మేరకు రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించామని, అయితే అక్కడ ఎముకల వైద్యులు అందుబాటులో లేకపోవడంతో కాకినాడ తీసుకువెళ్లామన్నారు. అక్కడ కూడా వారు సెలవులో ఉన్నారని, రెండుసార్లు కాకినాడ వెళ్లిన నవీన్ రెడ్డి తిరిగి జైలుకు వచ్చేశాడని, మూడోసారి తీసుకెళ్లి చికిత్స చేస్తున్నారన్నారు.
దవడ ఎముక విరిగితే ఆర్థోపెడిక్ జనరల్ సర్జన్, ఈఎన్ టీ వైద్య నిపుణుల ఆధ్వర్యంలో చికిత్స చేయాల్సి ఉంటుందని రాజమండ్రి జీజీహెచ్ ఆర్ఎంవో అన్నారు. ఈ మూడు విభాగాల వైద్య సిబ్బంది పూర్తిస్థాయిలో ఉన్నారన్నారు. దవడ గాయంతో రిమాండ్ ఖైదీ ఆసుపత్రికి వచ్చినట్లు తన దృష్టికి రాలేదని చెప్పడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.












Click it and Unblock the Notifications