చట్టం టీడీపీకి చుట్టమా..? : ప్రభుత్వాన్ని నిలదీస్తున్న ఓ లాయర్
నరసాపురం : బాధ్యతాయుతంగా మెలగాల్సిన ప్రజా ప్రతినిథులు అధికార దుర్వినియోగానికి పాల్పడితే చర్యలుండవా..? అని ప్రశ్నిస్తున్నారు ఏపీకి చెందిన కొంతమంది న్యాయవాదులు. దాదాపుగా రెండేళ్ల క్రితం జరిగిన ఓ ఘటనలో టీడీపీ ఎమ్మెల్యే మాధవ నాయుడు ఓ న్యాయవాది పట్ల దురుసుగా ప్రవర్తించడంతో అప్పట్లో ఎమ్మెల్యే మాధవనాయుడు మీద కేసు నమోదైంది.
కేసు అయితే నమోదు చేశారు గానీ ఇంతవరకు మాధవనాయుడుపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అక్కడి న్యాయవాదులు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా అదనపు న్యాయమూర్తి పి.కల్యాణ్ దీనిపై మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని నిలదీశారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అయినంత మాత్రానా ఎంత ఇష్టారాజ్యంగా వ్యవహరించినా..! వారిపై చర్యలు తీసుకోరా..? అని ప్రశ్నించారు.
ఓ న్యాయమూర్తిగా తనకే న్యాయం జరగకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉండుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆఖరికి న్యాయం కోసం న్యాయవాదులు కూడా మానవ హక్కుల కమిషన్ కు లేక రాయాల్సి వచ్చిందని అసంతృప్తి వ్యక్తం చేశారు.
న్యాయవాది పి.కల్యాణ్ ప్రెస్ మీట్ కి సంబంధించిన పూర్తి వివరాలను పరిశీలిస్తే.. సరిగ్గా 22 నెలల క్రితం నరసాపురం కోర్టు కాంపౌండ్ వాల్ కి ఆనుకుని ఉన్న కొన్ని ఆక్రమణలను కోర్టు సిబ్బంధి తొలగించారు. అయితే ఆక్రమణలను తొలగించిన విషయం తెలుసుకున్న ఎమ్యెల్యే మాధవనాయుడు కోర్టు అధికారులపైన తన ప్రతాపం చూపించారు.
ఈ నేపథ్యంలోనే గత ఆగస్టు 15వ తేదీన కోర్టు ఆవరణలో స్వాతంత్ర్య వేడుకలు జరుగుతున్న సందర్భంలో అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే మాధవనాయుడు, ఆక్రమణలు తొలగించడంపై న్యాయవాదులతో వాగ్వాదానికి దిగారు.
అదే సమయంలో అక్కడికి వచ్చి ఎమ్మెల్యేని వారించే ప్రయత్నం చేసిన న్యాయమూర్తి కల్యాణరావు పట్ల కూడా ఎమ్మెల్యే మాధవనాయుడు దురుసుగా ప్రవర్తించారు. దీంతో ఎమ్యెల్యే ఆగడాలపై పోలీసులకు ఫిర్యాదు చేశాయి కోర్టు వర్గాలు.
అయితే ఫిర్యాదు చేసి 22 నెలలు గడిచిపోయినా.. ఇప్పటివరకు మాధవనాయుడిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో, చట్టమైమైనా అధికార పక్షానికి చుట్టమా..? అని ప్రశ్నిస్తున్నారు అక్కడి న్యాయవాదులు. ఇంతవరకు ఘటనపై పోలీసులు ఛార్జీషీట్ కూడా దాఖలు చేయకపోవడంతో ఇక వేచి చూడడం లాభం లేదనుకున్న న్యాయవాది ప్రెస్ మీట్ పెట్టి బహిరంగంగా ప్రభుత్వాన్ని నిలదీశారు.
విషయాన్ని ఎన్నిసార్లు పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. పెద్దగా ఫలితం లేకపోవడంతో మానవ హక్కుల కమిషన్ కి, ఛీఫ్ ఎలక్షన్ కమిషన్ కి, అలాగే సీఎం చంద్రబాబు నాయుడు మరియు సుప్రీం కోర్టులకు లేఖలు రాశారు కల్యాణరావు.
చట్టం దృష్టిలో అందరు సమానమే అయినప్పుడు ఎమ్యెల్యే మాధవనాయుడిపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించిన ఆయన, పోలీసుల వైఖరితో విసిగిపోయినందుకే ఈ లేఖలు రాసినట్టుగా తెలియజేశారు.