గడ్డి కరుస్తాడు, 14 రీల్లో క్లైమాక్స్: చంద్రబాబు అవినీతిపై ఏకేసిన జగన్
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మండిపడ్డారు. ఎన్నికల్లో గెలవడానికి చంద్రబాబు చెప్పని అబద్దం లేదని వైసీపీ అధినేత వైయస్ జగన్ విజయవాడలో జరుగుతున్న విస్తృతస్థాయి సమావేశంలో అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఒక్క హామీని ప్రభుత్వం నెరవేర్చలేదని జగన్ ఆరోపించారు.
ఎన్నికల సమయంలో ఎక్కడ ఖాళీగా గోడలు కనపడినా ఆయన వాటిపై ప్రచారం చేసుకున్నారని విమర్శించారు. 'ఏ ప్రసంగం చేసినా రుణమాఫీ చేస్తాను అని మాట్లాడారు. డ్వాక్రా రుణాలు కూడా మాఫీ చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చాక రుణమాఫీ అన్న అంశాన్నే చంద్రబాబు మర్చిపోయార'ని జగన్ విమర్శించారు.
డ్వాక్రా మహిళలను సైతం ప్రభుత్వం మోసం చేసిందని జగన్ మండిపడ్డారు. చంద్రబాబు సీఎం అయ్యేనాటికి రైతు రుణాలు రూ. 87 వేలు కోట్లు ఉండేవన్నారు. దీంతో లక్ష లోపు రుణం వడ్డీ లేకుండా, 3 లక్షల లోపు రుణం పావలా వడ్డీకే వచ్చేదన్నారు. అవి కట్టొద్దని చెప్పిన పాపానికి, ఈరోజు అపరాధ వడ్డీ కింద రైతులకు 14-18 శాతం వడ్డీ కడుతున్నారన్నారు.
అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో 87 వేల కోట్ల రైతు రుణాల మీద వడ్డీ రూపేణా కేవలం 25వేల కోట్లు చెల్లించారని ధ్వజమెత్తారు. చంద్రబాబు చేసిన రుణమాఫీ వడ్డీల్లో మూడోవంతు కూడా సరిపోలేదని విమర్శించారు. కానీ అదే రుణమాఫీ అని, రైతులకు పూర్తిగా రుణమాఫీ అయిపోయిందని నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతూ, మోసం చేస్తున్నారన్నారు.
జాబు రావాలంటే బాబు రావాలి
ఇక చదువుకునే పిల్లల పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు. జాబు రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న ఉద్యోగాలు రేపు పొద్దున్న ఉంటాయో లేవో తెలియని దుస్థితిలో కాంట్రాక్టు ఉద్యోగులున్నారని విమర్శించారు.
రాష్ట్రంలో రోజుకో ఉద్యోగం ఊడుతోంది. ఆదర్శ రైతులు, ఫీల్డ్ అసిస్టెంట్లు ఇప్పటికే వెళ్లిపోయారన్న జగన్, గోపాలమిత్రలు ధర్నాలు చేస్తున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రెండు వేల నిరుద్యోగ భృతి గురించి అడిగితే, చంద్రబాబు నేనెప్పుడు చెప్పానంటున్నాడని మండిపడ్డారు.
ప్రజలకు ఏ సమస్య వచ్చినా వైసీపీ అందుబాటులో ఉంటుందని జగన్ ఈ సందర్భంగా అన్నారు. 'గడచిన సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబుకి కోటి ముప్పై ఐదు లక్షల ఓట్లు వస్తే, మనకి కోటి ముప్పై లక్షల ఓట్లు వచ్చాయి.. కేవలం ఐదు లక్షల ఓట్లే తేడా' అని ఆయన అన్నారు.
విలన్లా చంద్రబాబు
చంద్రబాబు బాధ్యతాయుతమైన పనిలో ఉంటూ ఒక విలన్లా ప్రవర్తిస్తున్నారని అన్నారు. 'సినిమాల్లో ఓ విలన్ ఉంటాడు.. ఎంతోమందిని ఆ విలన్ బాధపెడుతుంటాడు.. రాజనాల అటువంటి పాత్రలు పోషించేవాడు. నిజ జీవితంలో చంద్రబాబు అలాగే ప్రవర్తిస్తున్నారు' అని జగన్ వ్యాఖ్యానించారు.
'పదమూడు రీళ్ల వరకు తన దుష్ట చేష్టలతో విలనే కనిపిస్తుంటాడు. చివరికి పద్నాలుగవ రీలులో ప్రజల తరఫున పోరాడే హీరో వచ్చి ఆ విలన్ని మట్టికరిపిస్తాడు' అని చంద్రబాబుని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇది ఏ సినిమాలో చూసినా కనిపిస్తుంది, జీవితం అనే సినిమాలో కూడా చివరకు ఇదే జరుగుతుందని అన్నారు.
చంద్రబాబు మాదిరిగా సీఎం కావడానికి, సీఎం రేసులో ఉన్నవ్యక్తి ఈ మాదిరిగా ప్రజలను మోసం చేస్తూ పోతే, సీఎం కుర్చీలో కూర్చోడానికి ఏ గడ్డయినా తింటానంటే.. ప్రజలు చూస్తూ ఊరుకుంటూ పోతే ఈ వ్యవస్థ బాగుపడుతుందా? అని ప్రశ్నించారు. చంద్రబాబు రెండేళ్ల పాలన అంతా అవినీతిమయం కావడం చేతనే, చంద్రబాబు పట్ల ప్రజావ్యతిరేకత వస్తోందన్నారు.
చంద్రబాబుకు ఛాలెంజ్
రాజకీయ వ్యవస్థ బాగుపడాలన్నా, నాయకులకు గౌరవం రావాలన్నా ప్రజలు ఒకటి చేయాలని జగన్ సూచించారు. నాయకులు మోసాలు చేస్తే, అబద్దాలు చెబితే చెప్పులు, చీపుర్లు చూపిస్తామని గట్టిగా నిలదీస్తీ ఈ వ్యవస్ధ మారుతుందన్నారు. ఈ ఈ ఛాలెంజ్ ఎందుకు చేస్తున్నానంటే.. రేపు నాకైనా ఇదే వర్తిస్తుందన్నారు.
ఈ సందర్భంగా అబద్ధాలు ఆడితే ఎవరికైనా చెప్పులు, చీపుర్లు చూపించండని ప్రజలకు సూచించారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఫలానా వాడు మా నాయకుడని కార్యకర్తుల కాలర్ ఎగరేసుకునేలా మార్పు రావాలని జగన్ అన్నారు. మనమంతా కలిసికట్టుగా అడుగులు వేస్తేనే అది సాధ్యమమన్నారు.
రాజకీయ వ్యవస్థలో జవాబుదారీతనం
గడచిన ఎన్నికల్లో చంద్రబాబు రైతుల రుణాల మాఫీతో పాటు బ్యాంకుల్లో బంగారం మాఫీ, డ్వాక్రా రుణాలు మాఫీ మాత్రమే చెప్పాడని, వచ్చే ఎన్నికల్లో ప్రతి ఇంటికీ కారు లేదా విమానం కొనిస్తానంటాడని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్ధలో మార్పు రావాలంటే రాజకీయ వ్యవస్థలో జవాబుదారీతనం తీసుకురావాలన్నారు.
అప్పుడే ఈ వ్యవస్థ బాగుపడుతుందన్నారు. ఇప్పటి వరకు మనం ఎన్నో రాజకీయాలను చూశాం. కానీ ఎవరైనా అధికారంలో ఉన్న వ్యక్తి ప్రతిపక్షానికి చెందిన 20 మంది ఎమ్మెల్యేలను ఒక్కొక్కరికి రూ. 30 కోట్లు డబ్బు ఇచ్చి, మంత్రి పదవులు, కాంట్రాక్టులను ఎరగా చూపించి ఎమ్మెల్యేలను పశువుల్లా కొనే పరిస్థితి ఎక్కడైనా ఉందా? అని ప్రశ్నించారు.
ఒక్కో ఎమ్మెల్యేకు 30 కోట్లు
ఇది నింజగా ఆశ్చర్యమే. పట్టపగలు ప్రజలు చూస్తున్నారన్న స్పృహ కూడా లేకుండా.. 20 మందికి ఒక్కొక్కరికి రూ. 30 కోట్ల చొప్పున దాదాపు 600 కోట్ల రూపాయలు వెచ్చించి ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని దుయ్యబట్టారు. ఇంత డబ్బు నీ అత్తగారి సొత్తా అని అడిగేవారు లేరంటే వ్యవస్థను చూసి బాధగా ఉందని అన్నారు.
ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఇంత నల్లధనంతో పట్టుబడినా జైలుకు పోని పరిస్థితి మన రాష్ట్రంలో, మన దేశంలోనే ఉందంటే ప్రజాస్వామ్యాన్ని చూసి సిగ్గుపడాల్సి వస్తోందన్నారు. ఇదే పరిస్థితి మన రాష్ట్రంలో కొనసాగితే ప్రజాస్వామ్యం బతకదని హెచ్చరించారు.
ప్రజలతో పనిలేదు, ప్రజలకిచ్చిన మాటలతో పనిలేదు, అవినీతి విచ్చలవిడిగా చేస్తా, ఆ డబ్బుతో అవసరమైతే ఓటుకు 3, 4 వేలిచ్చి ప్రజలను కొనుగోలుచేస్తానని ముఖ్యమంత్రి స్థానంలో ఉండి చెబుతున్నారంటే మన రాష్ట్రంలో ఏ స్థితిలో ఉందో అర్ధం చేసుకోవాలన్నారు.
ప్రజా వ్యతిరేకత ఉన్నప్పుడు డబ్బులు పనిచేయవు
చంద్రబాబు కు ఓ సలహా ఇస్తున్నానని అన్నారు. ప్రజా వ్యతిరేకత ఉన్నప్పుడు డబ్బులు పనిచేయవని చెప్పిన జగన్ 2004 నాటి ఓ సంఘటనను గుర్తు చేశారు. 2004 నాటికి తొమ్మిదేళ్లు సీఎంగా ఉండి విచ్చలవిడిగా అవినీతి చేశావు. కానీ అప్పుడు వైఎస్ఆర్ వచ్చారు.. పాదయాత్ర చేశారు.
అనంతరం జరిగిన ఎన్నికల్లో టీడీపీకి వచ్చినవి కేవలం 41 స్థానాలు మాత్రమే. చాలాచోట్ల ఆ నాయకులు డిపాజిట్లు కూడా కోల్పోయారని ఆనాటి సంఘటనను గుర్తు చేశారు. ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోవాలి తప్ప ప్రజలను కొనుగోలు చేయడానికి అవినీతి చేస్తే.. ఆ అవినీతి సొమ్ము ఖర్చుచేస్తే నువ్వు గెలవవని చంద్రబాబుకు సూచించారు.
ముద్రగడ చేసిన తప్పేంటి..
ముద్రగడ చేసిన తప్పేంటని జగన్ ప్రశ్నించారు. ముద్రగడ పద్మనాభం దీక్ష చేస్తుంటే, ఆ దీక్షను భగ్నం చేయడం, ఆయన భార్యను, కొడుకును కొట్టుకుంటూ ఈడ్చుకుంటూ పోవడం అందరం చూశామన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని నిరాహారదీక్ష చేస్తే, అలాంటి వ్యక్తిని ఇలా శిక్షించడం సరైనదేనా అని ప్రశ్నించారు.
చంద్రబాబుకు నచ్చని వ్యక్తి ఎవరైనా ఏదైనా చేస్తే దొంగ కేసులు పెడతారని అన్నారు. చంద్రబాబు ఇలాంటి నీచమైన రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. పోలీసుల తీరు చూస్తుంటే టెర్రరిజాన్ని తలపిస్తోందన్నారు. ఈ సందర్భంగా పోలీసులను సైతం జగన్ హెచ్చరించారు.
అధికారం ఎల్లకాలం ఉండదు
ఈరోజు అధికారంలో ఉన్నది చంద్రబాబే కావచ్చు... కానీ అది ఎల్లకాలం ఉండదన్నారు. మీకు జీతాలు ఇచ్చేది చంద్రబాబు అత్తగారి సొత్తు కాదన్నారు. మీ టోపీ మీద ఉన్న మూడు సింహాలను గౌరవించడం నేర్చుకోవాలని హితవు పలికారు. మీకు ఇచ్చే జీతం ప్రజలు చెల్లిస్తున్నదని, వాళ్లకు న్యాయం చేయాలని కోరుతున్నానన్నారు.
ఎన్టీఆర్పై చెప్పులు వేయించిన నీచుడు చంద్రబాబు: లక్ష్మీపార్వతి
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ సీఎం ఎన్టీఆర్పై చెప్పులు వేయించిన నీచుడు చంద్రబాబు నాయుడని ఆయన భార్య లక్ష్మీ పార్వతి పేర్కొన్నారు. మంగళవారం విజయవాడలో జరిగిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. దివంగత సీఎం వైయస్ రాజశేఖరరెడ్డి కాళ్లు పట్టుకుని కేసు మాపీ చేయించుకున్న చంద్రబాబు ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నారని విమర్శించారు. వైయస్ జగన్ గురించి అలాంటి వ్యక్తి మాట్లాడటం సిగ్గుచేటుగా ఉందని అన్నారు.