నిన్న చిరంజీవి, రేపు జనసేన: పవన్ 'కొత్త స్నేహం'తో ఆ పార్టీల్లో వణుకు?
Recommended Video
అమరావతి: వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లెఫ్ట్ పార్టీలతో కలిసి ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే ప్రత్యేక హోదా అంశంపై వారితో కలిసి ఆయన నడుస్తున్నారు. టీడీపీ, బీజేపీ, వైసీపీలకు ఆయన సమదూరం పాటిస్తున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లోను కలిసి పోటీ చేయవచ్చునని భావిస్తున్నారు.
మోడీ నా జూనియరైనా సార్ సార్ అన్నాను: బాబు, పవన్! నీకు అలవాటేమో, అవమానిస్తావా: శివాజీ షాక్
పవన్ కళ్యాణ్ లెఫ్ట్ పార్టీలతో కలిస్తే ఇతర పార్టీలపై ప్రభావం బాగా చూపే అవకాశాలున్నాయని అంటున్నారు. ఒకటి పవన్కు ఉన్న క్రేజ్, రెండోది.. ఎలాగు గెలవదని కొన్ని సందర్భాల్లో లెఫ్ట్ కూటమికి ఓటు వేయని వారు కూడా ఇప్పుడు ఇటువైపు మొగ్గు చూపే అవకాశాలు కొట్టిపారేయలేమని అంటున్నారు. ప్రధాన పార్టీలకు ఇది దెబ్బ అంటున్నారు.
ఇతర పార్టీల ఆందోళన
లెఫ్ట్ పార్టీలకు గ్రామీణ, నగర ప్రాంతాల్లో ఓటు బ్యాంకు ఉంది. ఇది జనసేనకు ఉపయోగపడుతుంది. అలాగే పవన్ కళ్యాణ్కు వ్యక్తిగతంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇది అంతకంటే ఎక్కువగా లెఫ్ట్ పార్టీలు బలం పుంజుకోవడానికి ఉపయోగపడవచ్చునని భావిస్తున్నారు. ఈ కలయిక టీడీపీ, వైసీపీ, బీజేపీని దెబ్బతీస్తుందని భావిస్తున్నారు. ఈ విషయంలో ఇప్పటికే ఆ పార్టీలు ఆందోళనగా ఉన్నాయని అంటున్నారు.
అనంతపురం నుంచి పవన్ పోటీ, ఇది ప్లస్
వచ్చే ఎన్నికల్లో తాను అనంతపురం జిల్లా నుంచి పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ గతంలో ప్రకటించారు. ఆయన క్రేజ్కు లెఫ్ట్ జత కలుస్తుంది. రెండు దశాబ్దాల క్రితం అనంతపురంలో సీపీఐ గెలిచింది. ఇప్పుడు పవన్ ద్వారా పుంజుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. అప్పుడు కే రామకృష్ణ అనంతపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. గేయానంద్ ఎమ్మెల్సీగా విజయం సాధించారు. కర్నూలు, కడప జిల్లా హెడ్ క్వార్టర్లోను సీపీఎం, సీపీఐ పార్టీలకు ఓటు బ్యాంకు ఉంది. ఇతర గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఓటు బ్యాంకు ఉంది. కానీ ఇన్నాళ్లు పోటీ చేయకపోవడమో లేక గెలుస్తారనే నమ్మకం లేక ఓటు ఇతర పార్టీలకు పడ్డ సందర్భాలు కొట్టి పారేయలేం.
పవన్తో కలిసి పోటీ చేసేందుకు ఆసక్తి
ప్రత్యేక హోదా ఉద్యమంలోనే కాకుండా 2019 ఎన్నికల్లోను పవన్తో కలిసి పోటీ చేసేందుకు సీపీఐ ఆసక్తితో ఉంది. తాము వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసి ముందుకు సాగుతామని, ప్రజల సంక్షేమమే తమ అజెండా అని లెఫ్ట్ పార్టీలు చెబుతున్నాయి.
నాడు చిరంజీవి, నేడు పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్కు లెఫ్ట్ పార్టీలు జత కలిస్తే అది ఇతర పార్టీలపై తీవ్ర ప్రభావం పడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2009 సాధారణ ఎన్నికల సమయంలో పవన్ అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి కాంగ్రెస్, టీడీపీ ఓట్లను భారీగా చీల్చారు. చిరంజీవి పీఆర్పీతో పాటు లోక్సత్తా కారణంగా నాడు టీడీపీ దెబ్బతిన్నదనే అభిప్రాయాలు ఉన్నాయి.
పవన్ కళ్యాణ్ స్నేహం, పెద్ద పార్టీల్లో ఆందోళన
ఇప్పుడు పవన్ కళ్యాణ్ క్రేజ్, దానికి తోడు మంచి ఓటు బ్యాంకు కలిగిన లెఫ్ట్ పార్టీలు జత కలవడం ఇతర పార్టీల్లో కలవరం కలిగించేదే అంటున్నారు. ఓ విధంగా 2009 నాటి సీన్ రిపీట్ అవుతుందని, అయితే ఇప్పుడు పవన్ ఎవరిని దెబ్బతీస్తారనేది చూడాలని అంటున్నారు. గత ఎన్నికల్లో పవన్ టీడీపీకి మద్దతు పలికినందున గోదావరి జిల్లాల్లో ఆ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చాయని, ఆ పార్టీ పైనే ప్రభావం పడుతుందని కొందరు చెబుతుండగా, వైసీపీ పైన ఉండదని కొట్టిపారేయలేమని కొందరు అంటున్నారు. మొత్తానికి పవన్ కొత్త ఫ్రెండ్ షిప్ (లెఫ్ట్) పార్టీల్లో ఆందోళనకు కారణమైందని అంటున్నారు.