90కోట్లకు మైహోం అధినేత నోటీసు, అదే మాటపై రేవంత్
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డికి మైహోం రామేశ్వర రావు లీగల్ నోటీసులు పంపించారు. రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణల వల్ల పరువు నష్టం కలిగిందని రూ.90 కోట్లకు ఈ నోటీసులు పంపించారు. కొద్ది రోజుల క్రితం మెట్రో భూములకు సంబంధించిన అంశంపై రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కాగా, మైహోం రామేశ్వర రావు పైన తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని తెలిపారు.
కేసులకు భయపడేది లేదని, కోర్టులోనే తేల్చుకుంటానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రామేశ్వర్ రావుకు భూముల కేటాయింపుపై తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానన్నారు. రేవంత్రెడ్డి ఒక్కడు కాదు... తన వెనక టీడీపీ, లక్షలాదిమంది కార్యకర్తలు ఉన్నారన్నారు. తెలంగాణ ప్రజల సంపద కాపాడేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటం కొనసాగుతుందన్నారు.
డిజిటల్ హైదరాబాద్ కోసం కృషి: కేటీఆర్
హైదరాబాద్ నుంచి మొదలుపెట్టి మొత్తం తెలంగాణను డిజిటలైజ్ చేస్తామని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వేరుగా అన్నారు. తెలంగాణకు హైదరాబాద్ పెద్ద ఆర్థిక వనరు అని, పన్నులు, ఆదాయం విషయంలో పూర్తి పారదర్శకతను పాటిస్తామన్నారు.
హైదరాబాదులో జరుగుతున్న మెట్రోపొలిస్ సదస్సులో కేటీఆర్ ప్రసంగించారు. సాంకేతికతను వినియోగించుకోవడంలో ప్రతి వ్యక్తినీ భాగస్వామిని చేస్తామన్నారు.
తెలంగాణకు సంబంధించిన సమగ్ర వివరాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహించామని, సర్వే సమాచారంతో అన్ని ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తామన్నారు. గ్రామ స్థాయి నుంచి హైదరాబాద్ వరకు సర్వే జరిగిందని చెప్పారు. ఒకేరోజు కోటి ఇళ్లలో సర్వే చేశామన్నారు. డిజిటల్ హైదరాబాద్ కోసం తాము కృషి చేస్తున్నామని తెలిపారు.